వినియోగిస్తే డివైడర్లలోని మొక్కలకు సకాలంలో తడులు
బల్దియాపై తగ్గనున్న ట్యాంకర్ల వ్యయం
కార్పొరేషన్, ఏప్రిల్ 2: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నా నగరపాలక సంస్థ అధికారులు వాటిని మధ్యలోనే వదిలేస్తున్నారు. దీంతో లక్షల వ్యయంతో చేపడుతున్న పలు పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. నగరంలో పచ్చదనాన్ని నింపేందుకు నగరపాలక సంస్థ ప్రధాన రహదారుల్లోని డివైడర్లలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. వీటితో పాటు ఈసారి హరితహారంలో భాగంగా ఆయా ప్రధాన రహదారుల్లో ఇరువైపులా మొక్కలు నాటారు. అయితే డివైడర్లలో నాటిన మొక్కలకు నీటి తడులు అందించాలంటే ప్రతి సంవత్సరం లక్షలు వ్యయం చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వస్తున్నది. వ్యయం తగ్గించేందుకు రెండేళ్ల క్రితమే అప్పటి మున్సిపల్ పాలకవర్గం డివైడర్లలో మొక్కలకు నీటి తడులు అందించడంతో పాటు అన్ని చౌరస్తాల్లో సుందరీకరణకు ఉపయోగపడే విధంగా బోర్లు వేయించారు. నగరంలోని 9 ప్రధాన చౌరస్తాల్లో రూ.12 లక్షలతో బోర్లు వేయించి, నాలుగింటికి విద్యుత్ మోటర్లు సైతం బిగించారు. మిగతా చౌరస్తాల్లో వేసిన బోర్లను అలాగే వదిలేశారు.
పట్టించుకోని వైనం
నగరంలోని చౌరస్తాల్లో ఫౌంటెయిన్లతో పాటు డివైడర్లలో మొక్కలకు సకాలంలో నీటి తడులు అందించేందుకు బస్టాండ్, మంచిర్యాల చౌరస్తా, తెలంగాణ చౌక్, నాకా చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, కమాన్, గాంధీ, కోర్టు, ఐబీ చౌరస్తాల్లో బోర్లు వేయించారు. వీటి నుంచి డ్రిప్ పద్ధతిలో ఆయా ప్రాంతాల్లోని డివైడర్లలో మొక్కలకు నీటి తడులను తక్కువ వ్యయంతో అందించాలని రెండేళ్ల క్రితం అధికారులు నిర్ణయించారు. కాగా, వీటిలో బస్టాండ్, కోర్టు, నాకా, మంచిర్యాల చౌరస్తాలోని బోర్లకు విద్యుత్ మోటర్లు బిగించి చౌరస్తాలోని ఫౌంటెయిన్ల నిర్వహణకు వినియోగిస్తున్నారు. కానీ, డివైడర్లలోని మొక్కలకు నీటి తడులు అందించేందుకు డ్రిప్ అమర్చే ఆలోచన పక్కన పెట్టారు. ప్రస్తుతం డివైడర్లలోని మొక్కలకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పడుతున్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థ సుమారు రూ. 10 లక్షల మేరకు వ్యయం చేస్తున్నది. ఒకేసారి అన్ని ప్రాంతాల్లోని డివైడర్లకు ఈ మోటర్ల ద్వారా డ్రిప్ను అమర్చితే ఎంతో వ్యయం తగ్గుతుందని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. డ్రిప్ పద్ధతితో నీటి వృథా తగ్గడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బల్దియా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చూడండి..
హిమాలయాల్లో 2 టన్నుల చెత్త.. సేకరించిన నేపాల్ పర్వతారోహకులు
కుక్క కోసం బస్సు ఆపిన డ్రైవర్.. వీడియో వైరల్