తెలంగాణ అనాది నుంచే సాహిత్యానికి, కళలకు కాణాచి. తెలంగాణకు తనదైన ఒక విలక్షణ సంస్కృతి వుంది. ఇది అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు సంస్కృతి. తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతంలో ఈ ఉమ్మడి సంస్కృతి బ్రిటిష్ పాలనా కాలంలో కొంత అంతరించిపోతే, మరికొంత ఇతర నాగరికతతో కలుషితమైపోయింది. అయితే, తెలంగాణలో మాత్రం వేల ఏండ్లుగా కొనసాగుతున్న తెలుగు భాష, సంస్కృతి స్వచ్ఛంగా, జీవస్రవంతిలా కొనసాగుతూనే ఉన్నది.
జానపద కళలకు, సాహిత్యానికి తరగని గని తెలంగాణ. జానపద సాహిత్యంలో ఇక్కడి జనజీవనంలోని ప్రతి అంశమూ ప్రతిబింబిస్తుంది. ఈ జానపద కళలు ఒకతరం నుంచి మరోతరానికి వస్తూ సజీవంగా నిలచి వున్నాయి. ముఖ్యంగా స్త్రీల పాటలు, కోలాటం, ఉయ్యాల, పిల్లల పాటలు, జాజిరి, కాముని పాటలు, శృంగార గేయాలు మొదలైనవి ముఖ్యమైనవి. జానపద గేయ రూపాలలో కథా సాహిత్యం కూడా ఎంతో వుంది. అందులో పేదరాశి పెద్దమ్మ కథలు, బాణామతి కథ లు, ఊర్మిళాదేవి నిద్ర, మాతపురాణం, బాలనాగమ్మ కథ మొదలైనవి ఎంతో శ్రావ్యంగా పాడి వినిపించే జానపద కళాకారులు తెలంగాణలో వున్నారు.
ప్రతి పనిలోనూ తెలంగాణ పల్లె ప్రజలకు పాటలు పాడుకోవడం ఆనవాయితీ. ఈ శ్రామిక గీతాలలో మోట బావి పాటలు మొదలుకొని, వరి నాట్లప్పుడు, కలుపు తీసేటప్పుడు, కోతల సమయంలో పాడుకొనే పాటలు ఎన్నో వున్నాయి. ఇవి గాక బతుకమ్మ, బోనాలు, పీర్ల పండుగ వంటి ఎన్నో సామాజిక పరమైన ఉత్సవాలను జరుపుకొంటారు.ఆ సందర్భంలో పాడే పాటలు దేనికదే విలక్షణతను కలిగి వుంటాయి. ప్రదర్శన కళలలో చిరుతల రామాయ ణం, వీధి నాటకాలు జనాన్ని అలరించాయి.
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి బతుకమ్మ పండుగకు ప్రాణం పోశారు. ఈ స్ఫూర్తితో తెలంగాణ మహిళలు వాడవాడలా బతుకమ్మ ఆడటమే కాక, ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తరతమ బేధాలు మరచి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి అటెండర్ల వరకు అందరూ కలిసి బతుకమ్మ ఆడిన అపురూప దృశ్యాలను మనం చూశాం. కీ.శ. మొదటి శతాబ్దానికి చెందిన హాలుడనే శాతవాహన చక్రవర్తి 700 గాథలను సేకరించి, గాథాసప్తశతి పేరుతో కావ్యాన్ని కూర్చాడు. దీనిలో నాటి గ్రామీణుల జీవితం వాస్తవికంగా ప్రతిబింబించింది.
తెలంగాణ నిరంతరం సాహిత్య రచనలతో ఫలవంతంగా ఉండేదని శాతవాహన యుగాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ సాహిత్య వాసనలే తర్వాత తెలంగాణాను పాలించిన రాజుల ఆస్థానాలలో గుబాళించాయి. శాతవాహనుల చివరి రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో బౌద్ధ మతాచార్యుడైన నాగార్జునుడు ఇప్పటి నాగార్జున కొండ మీద విజయపురిలో ఆశ్రమాన్ని నిర్మించుకుని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఈ విజయపురి శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులకు రాజధాని అయింది. తెలుగు నాట వేసిన అతి ప్రాచీన శాసనాలు తెలంగాణాలోనే దొరికాయి. కన్నడ సాహిత్యంలో ఆదికావ్యమైన మహాభారతం తెలుగు గడ్డపైనే రాయబడటం విశేషం. కన్నడ భాషలో భారతం రాసిన పంప మహాకవి సమాధిని బోధన్ సమీపంలో పరిశోధకులు గుర్తించారు.
పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని సీఎం కేసిఆర్ ఎన్నోసార్లు తెలియజెప్పారు. ఈయన రచించిన పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం ఎంతో పాండిత్యస్ఫోరకమైన కావ్యాలు. ఈయన వరంగల్ సమీపంలోని పాలకుర్తి నివాసి. ఆ ప్రక్కనే గల బమ్మెరలో జన్మించి, తెలుగులో భాగవతం రచించి, తెలుగు వారి పుణ్యపేటికగా ప్రసిద్దిచెందిన బమ్మెర పోతన కూడా తెలంగాణలోనే ప్రభవించాడు. తెలంగాణ సాయుధపోరాట సమయంలో దాశరథి, సుద్దాల హనుమంతు, పీవీ నరసింహారావు వంటి కవులు, రచయితలు ఎన్నో విప్లవ గేయాలను, కవితలను రాసి, ఉద్యమకారులలో స్ఫూర్తిని రగిలించారు.
నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ సాహిత్య వైభవం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఒక్కసారిగా నిద్రలేచింది. జానపద గేయాలు వెల్లువలా ముంచెత్తాయి. జానపద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఉర్రూతలూగించాయి. కేసీఆర్ గారికి కళలన్నా, సాహిత్యమన్నా అపరిమితమైన అభిమానం. తెలంగాణ జానపద కళాకారులకు, సాహిత్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనంత గౌరవాదరాలు లభిస్తున్నాయి. 550 మంది నిరుపేద జానపద కళాకారులకు నెలకు రూ.24,550 గౌరవ వేతనంతో ఆదుకుంటున్నది. కేసీఆర్ హయాంలో కవులు, పండితులు ఎంతో గౌరవాదరాలను పొందుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే గాక, దాని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడు కేసీఆర్.
కేసీఆర్ తెలంగాణ ప్రజల స్వప్నమైన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే బాధ్యతను తన భుజస్కంధాల మీదకి తీసుకున్న నాడే తెలంగాణ సాంస్కృతిక పునర్వికాసం వైపు కూడా దృష్టి సారించారు. తెలంగాణ అసలు సిసలైన సంస్కృతిని తిరిగి పునరుజ్జీవింప జేయడానికి ప్రజలలో స్ఫూర్తి నింపారు. నిజానికి తెలంగాణ సాంస్కృతిక వికాసం తెలంగాణ ఉద్యమంలో ఒక భాగంగా సాగింది.
-కోలేటి దామోదర్
ఇవీ కూడా చదవండి..
తెలంగాణలో మాస్కులు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు
ముక్కు అవినాష్కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత