వరంగల్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టభద్రులు మరోసారి టీఆర్ఎస్కు పట్టం కట్టారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. 71 మంది బరిలో నిలువగా ఓటర్లు పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. యువత, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులంతా టీఆర్ఎస్కే మద్దతు తెలిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి తాజాగా మరోసారి విజయం సాధించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ తీర్పు అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నా రు. వరంగల్ జిల్లాకు చెందిన పల్లా ఎమ్మెల్సీగా ఎన్నికవడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం సాధించిన సురభి వాణీదేవికి వరంగల్ నగరంతో అనుబంధం ఉన్నది. వరంగల్ అర్బన్ జిల్లాలోని వంగర ఆమె సొంతూరు. ఇద్దరు ఎమ్మెల్సీలు వరంగల్తో అనుబంధం ఉన్న వారే కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ విజయం టీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలానిచ్చినట్లయిందని పలువురు భావిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపు ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త విజయమని, సీఎం కేసీఆర్ పాలనకు పట్టభద్రులు మద్దతు ఇచ్చారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.