నిరుద్యోగ ఎస్సీ యువతకు తెలంగాణ సర్కారు తీపికబురును అందించింది. స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా సబ్సిడీ రుణాన్ని అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 47 యూనిట్లకు దరఖాస్తులను స్వీకరించగా, తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా అదనంగా మరో 37 యూనిట్లను చేర్చింది. అయితే కార్పొరేషన్ రుణాలకు ఇదివరకే దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే దీనికి అర్హులు. కాగా, దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు ఈ నెల 31వ తేదీ వరకు గడువును ఇచ్చింది.
వార్షిక ప్రణాళిక 2020-21 కింద నిరుద్యోగ యువతీయువకులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను అందజేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40.75లక్షల నిధులు మంజూరు చేసింది. మొత్తంగా 933 మందికి రుణాలను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 18 నుంచి 55 ఏండ్ల వయస్సులోపు ఉన్న వారి నుంచి, 47 కేటగిరిల వారీగా అధికారులు ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. ఆయా రంగాలకు సంబంధించి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 మండలాల నుంచి ఇప్పటికే 5,495 అప్లికేషన్లు వచ్చాయి.
గతంలో ఎస్సీ కార్పొరేషన్ 47 కేటగిరిలకు సబ్సిడీ రుణాలను అందించాలని నిర్ణయించింది. అయితే త్రీ వీలర్, ఫోర్ వీలర్, సిమెంట్ బ్రిక్ మేకింగ్ తదితర కేటగిరిలకు రూ.5లక్షలకు పైగా రుణం అందించాల్సి ఉంది. జిమ్, మెడికల్ షాప్, స్లాబ్ కట్టింగ్ తదితర యూనిట్లయితే రూ.12లక్షలకు పైగా అందించాలని నిర్ణయించింది. అయితే.. ఇక్కడ ప్రభుత్వం అందించే రాయితీ పోను మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంది. ఇది నిరుపేద ఎస్సీ యువతకు భారంగా మారుతున్నది. అదీగాక రాయితీ రుణం పొందాలంటే ముందుగా బ్యాంకులు అందుకు కాన్సెంట్ (సమ్మితి) పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. అది ఉంటేనే రుణం పొందే వీలుంటుంది. ప్రస్తుతం కార్పొరేషన్ ప్రకటించిన పలు భారీస్థాయి యూనిట్లకు కాన్సెంట్ లెటర్ ఇవ్వడానికి పలు బ్యాంకులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఆ సమస్యలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కార్పొరేషన్ సబ్సిడీ రుణాల్లో కీలక మార్పులు చేసింది. తాజాగా అదనంగా 37 చిన్న యూనిట్లను చేర్చింది. అదీగాక రూ.50వేల వరకు రాయితీ రుణాన్ని నేరుగా అందించాలని నిర్ణయించింది. ఇది నిరుద్యోగ యువతకు ఎంతో వరంగా మారనుంది.
ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ 47 యూనిట్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. అందుకు సంబంధించిన గడువు కూడా ఫిబ్రవరి 10తోనే ముగిసింది. ఆయా కేటగిరలకు సంబంధించి సబ్సిడీ రుణాలకు జిల్లావ్యాప్తంగా మొత్తం 5,495 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఒక్క ఫోర్ వీలర్ వాహనాల కొనుగోలుకు సంబంధించినవే 1,430 కావడం విశేషం. మిగతా యూనిట్లపై యువత అంతగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అదనంగా మరో 37 యూనిట్లను కార్పొరేషన్ రుణాల జాబితాలో చేర్చింది. అందులో ఎక్కువగా రూ.50 వేల నుంచి లక్ష విలువ చేసే యూనిట్లే ఎక్కువగా ఉండటం విశేషం. ముఖ్యంగా పాడి పశువుల కొనుగోలు, ఫౌల్ట్రీ, చెప్పుల షాపు, ఫ్యాన్సీ బ్యాంగిల్ షాపు, ఎలక్ట్రిక్ మోటర్ రిపేర్, గ్రైండింగ్ సెంటర్, తేనే సేకరణ యూనిట్, జ్యూస్ సెంటర్, మొబైల్ సర్వీస్ అండ్ ఆక్సెసరీస్, సెరికల్చర్ నర్సరీ (ఎకరం), టైలరింగ్ యూనిట్, టీ, టిఫిన్ సెంటర్ ఏర్పాటునకు కూడా రాయితీ రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఇవే గాక రూ.1 నుంచి రూ.4లక్షల లోపు విలువ చేసే కర్రీ పాయింట్, బైక్ మెకానిక్ తదితర షాపులను పెట్టుకునేందుకు కూడా అదనపు అవకాశాన్ని కల్పించింది.
తాజా జాబితాలో చేర్చిన 37 యూనిట్లకు సంబంధించిన రాయితీ రుణాలకు మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే అందుకు అర్హులని స్పష్టం చేసింది. కొత్తగా దరఖాస్తులను స్వీకరించరని తెలిపింది. మార్చి 31లోగా దరఖాస్తుదారులు ఆన్లైన్లో తమ దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం గతం లో ఉన్న 47 కేటగిరిలకు అదనంగా మరో 37 యూనిట్లను సబ్సిడీ రుణాల జాబితాలో చేర్చింది. ఇప్పటికే సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే అర్హులు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ ఎస్సీ యువత సద్వినియోగం చేసుకోవాలి. అప్లికేషన్లలో పేరు, బ్యాంకు, అడ్రస్ తదితర వివరాలతో పాటు, యూనిట్ల మార్పునకు సంబంధించిన వివరాలను దరఖాస్తుదారులు సవరించుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం మార్చి 31 వరకు ఎడిట్ ఆప్షన్ వెసులుబాటును కల్పించింది. మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తుదారులు మార్పులు, చేర్పులు చేసుకోవాలి. – డాక్టర్ రమేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్ జిల్లా ఎస్పీ కార్పొరేషన్