హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 11,728 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సమైక్య రాష్ర్టంలో కేవలం రూ. 200 పెన్షన్ ఇస్తే.. తెలంగాణ రాష్ర్టంలో రూ. 2,016 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాల బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు రూ. 2,106 చొప్పున, వికలాంగులకు రూ. 3,016 చొప్పున ప్రతీ నెల పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ర్టంలో 39 లక్షల 36 వేల 521 మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 2019-20లో కేంద్ర ప్రభుత్వం మనిషికి రూ. 200 చొప్పున 6 లక్షల 66 వేల మందికి గాను రూ. 105 కోట్ల సహాయం అందించిందన్నారు. వీరిందరికి ఒక్కొక్కరికి రూ. 1,816 కలిపి రాష్ర్ట ప్రభుత్వం రూ. 2,016 పెన్షన్ అందిస్తుందన్నారు. మిగతా 31 లక్షల 31 వేల 660 మంది అసహాయులకు నెలకు రూ. 2016 చొప్పున, వికలాంగులకు రూ. 3,016 చొప్పున పూర్తి భారాన్ని రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తూ ఆసరా పెన్షన్లను అందిస్తున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.