మేడ్చల్, మార్చి 16(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్ సమావేశాపు హాల్లో మంగళవారం పరిశ్రమల అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యధిక పరిశ్రమలున్న మేడ్చల్ జిల్లా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలోని నలుమూలలా ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు విస్తరించి ఉన్నాయని, వాటికి ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు పూర్తి సహకారం అందిస్తుందని వివరించారు. ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు పురోభివృద్ధి సాధించేందుకు అన్ని రకాల సదుపాయాలు, వసతులు కల్పించాలని జిల్లా పెట్టుబడుల ప్రమోషన్ కమిటీకి కలెక్టర్ శ్వేతా మహంతి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన తోడ్పాటుకు ఏర్పాటు చేసిన టీఎస్ ఐపాస్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు చేయూతనిస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు గడువులోగా అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. పారిశ్రామికాభివృద్ధి జరిగితే యవతకు ఉద్యోగా అవకాశాలు పెరుగుతాయన్నారు. సమావేశంలో పరిశ్రమల జిల్లా అధికారి పి.రవీందర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.