దీదీపై దాడి డ్రామా రక్తి కట్టలేదు : దిలీప్ ఘోష్
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై దాడి ఆరోపణలపై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందించారు. మమతా బెనర్జీపై దాడి గొప్ప డ్రామా అని..కానీ అది రక్తి కట్టించలేదని ఎద్దేవా చేశారు. దీదీ గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే వ్యక్తిపై ఇలాంటి ఘటన ఎలా జరుగుతుందని దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. బీజేపీని దెబ్బతీసేందుకే దాడి అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
మమతా బెనర్జీ గాయపడ్డారనేదానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. మరోవైపు దవాఖానలో బెడ్పై నుంచి మమతా బెనర్జీ వీడియోను తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేశారు. తన కాళ్లు, ఛాతీ, ఎముకలకు గాయాలయ్యాయని ఈ వీడియోలో ఆమె చెప్పుకొచ్చారు. రెండు మూడు రోజుల్లో తాను ప్రజల్లోకి వస్తానని, ప్రచార సభల్లో పాల్గొంటానని పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని దీదీ పేర్కొన్నారు.