న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీలో ఇటీవలే చేరిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఒకట్రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ చక్రవర్తికి వై ప్లస్ కేటగిరి భద్రతను కేంద్రం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గత ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో నిర్వహించిన మెగా ర్యాలీ సందర్భంగా మిథున్ చక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యానే ఆయనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కేటాయిస్తున్నట్లు సమాచారం. అయితే సీఐఎస్ఎఫ్ బలగాలు చక్రవర్తికి భద్రతను కల్పించనున్నాయి. దేశ వ్యాప్తంగా 104 మంది వీఐపీలకు సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రతను కల్పిస్తున్నాయి. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఉన్నారు.