నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ఖైరతాబాద్, మార్చి 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీసీలకు చెందినవారికే టీఆర్ఎస్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య బీసీ బిడ్డ అని.. తిరిగి ఆ వర్గాలకే టికెట్ ఇస్తే.. టీఆర్ఎస్కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ లు బీసీలను ఓటర్లుగానే చూస్తూ.. చట్టసభల్లో వారి మొండి చేయిచూపుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ బిల్లు పెట్టకుండా కేంద్రప్రభుత్వ తాత్సారం చేస్తున్నదని ఆరోపించారు. దేశ జనాభాలో బీసీల జనాభా 56 శాతం ఉన్నదని.. కానీ, ఏ రంగంలోనూ సమాన వాటా లేదన ఆవేదన వ్యక్తంచేశారు.
రాజకీయాల్లో 14 శాతం, ఉద్యోగాల్లో 16శాతం, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికరంగాల్లో ఒక్కశాతానికి మించి బీసీలు లేరని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలోనూ వివక్షే చూపుతున్నారని తెలిపారు. ‘మా జనాభా ఎంతో మాకంత’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని బీసీలు అందరూ ఆ డిమాండ్ సాధన కోసం తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు ప్రతిసందర్భంలోనూ బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.