ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నాకొద్ది మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నది. హైదరాబాద్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ పటిష్టమైన ప్రచార వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి 50మంది ఓటర్లకు ప్రచార కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. అన్ని వర్గాలతో సమావేశమవుతూ టీఆర్ఎస్కు మద్దతును కూడగడుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొని అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేయాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు వాణీదేవి ఉన్నత విద్యాభ్యాసాన్ని ఆమె సామర్థ్యాన్ని ఇటు ప్రచార కమిటీలకు, అటు ఓటర్లకు వివరిస్తున్నారు. ఖైరతాబాద్, ముషీరాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలలో జరిగిన సమావేశాలకు అద్భుత స్పందన లభించిందని మంత్రి గంగుల తెలిపారు. టీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని, మొన్న టీఎన్జీవోలు, నిన్న టీజీవోలు, నేడు సీపీఎస్ ఉద్యోగ సంఘాలు టీఆర్ఎస్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయని వివరించారు.
మియాపూర్ , మార్చి 8 : ఉన్నత విద్యావంతురాలైన వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, తద్వారా అభివృద్ధిని కొనసాగించుకునేందుకు మరింత అవకాశం ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కార్యాలయంలో సోమవారం డివిజన్లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటింగ్పై అవగాహన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, విప్ అరెకపూడి గాంధీ, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ విప్లవ్కుమార్, ఎన్నికల ఇన్చార్జి వాసాల రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ వర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వీటన్నింటినీ ఈ మూడు రోజుల పాటు ప్రతి ఓటరు ఇంటింటికి వెళ్లి వివరించి వారి మద్దతును కూడగట్టాలన్నారు. పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి వాణీదేవిని చట్టసభకు పంపాలని, ఇందుకోసం శ్రమించాలని పేర్కొన్నారు.