నోయిడా : యూపీలోని అలీఘడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు ఢీకొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. అలీఘడ్ జిల్లా లోధ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్సువా గ్రామ సమీపంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. హర్యానా రోడ్ వేస్కు చెందిన ఓ బస్సు టైర్ పేలి అదుపుతప్పి అదే రోడ్ వేస్కు చెందిన మరో బస్సును ఢీకొట్టింది.
బస్సులు ఢీకొన్న వేగానికి నలుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కళాశాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ చంద్రభూషణ్ సింగ్ తెలిపారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.