‘సమకాలీన పరిస్థితులను ప్రతిబింబిస్తూ సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. వ్యవసాయం గొప్పతనాన్ని చాటిచెబుతూ సరికొత్త బ్యాక్డ్రాప్లో వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది’ అని అన్నారు సీనియర్ నటుడు నరేష్. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ హీరోగా నటించారు. కిషోర్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో నరేష్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ప్రస్తుతం విద్యావంతులు వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారు. రైతులుగా మారాలనే ఆలోచనతో ఎన్ఆర్ఐలు మాతృభూమికి తిరిగి వస్తున్నారనే కథాంశాన్ని దర్శకుడు కిషోర్ ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. రైతుగా శర్వానంద్ చక్కటి నటనను కనబరిచాడు. ఇందులో నేను చిత్తూరు ప్రాంత రైతుగా కనిపిస్తా. చిత్తూరు యాసతో మాట్లాడుతూ నా పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. 14 రీల్స్ ప్లస్ సంస్థకు అవార్డులతో పాటు రివార్డులను తెచ్చిపెడుతుంది. గత నాలుగు నెలల్లో పన్నెండు సినిమాలు పూర్తిచేశా. నటనకు ప్రాముఖ్యమున్న పాత్రలు లభిస్తుండటం ఆనందంగా ఉంది. యువ దర్శకులు నన్ను దృష్టిలో పెట్టుకొని విలక్షణ పాత్రలు రాస్తున్నామని చెప్పడం పెద్ద అవార్డుగా భావిస్తున్నా. తెలుగులో లాక్డౌన్ తర్వాత విడుదలైన సినిమాలన్నీ 300 కోట్లవరకు వసూళ్లు చేశాయి. ప్రస్తుతం 80 సినిమాల షూటింగ్లు జరుగుతున్నాయి. తెలుగు చిత్రసీమకు ఇదొక స్వర్ణయుగం. ఇతర భాషలతో పోలిస్తే మన సినిమాల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. కొత్త తరహా కథాంశాలకు ఆదరణ పెరిగింది. వైవిధ్యత మేళవించిన చిత్రాల్నే ప్రేక్షకులు ఇష్టపడుతుండటం చక్కటి పరిణామం’ అని అన్నారు.