నిధులు సాధించి ప్రజల్లోకి రండి
జలవాటాపై కేంద్రాన్ని నిలదీయండి
కేసీఆర్ పాలనను విమర్శిస్తే ఊరుకోం.. ఖబడ్డార్
బీజేపీ, కాంగ్రెస్పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధ్వజం
జనగామ, జూలై 19 (నమస్తే తెలంగాణ) : నాడు అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయలేక, చేతగాని దద్దమ్మలుగా మిగిలిన పార్టీలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన జనగామలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు భూములు, ఆస్తులు అమ్మగా వచ్చిన డబ్బును ఏ ప్రాంతంలో ఖర్చుపెట్టారని నిలదీశారు. అట్టడుగున ఉన్న దళిత కుటుంబాలకు ఆర్థిక సమానత్వం కల్పించాలనే సంకల్పంతో దున్నడానికి పనికిరాని బీడు భూములను అమ్మి దళితబంధు పథకం అమలుకు శ్రీకారం చుడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేక అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు.
దళితుల స్థితిని మార్చేందుకు సీఎం కేసీఆర్ కఠినమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుంటే బండి సంజయ్, రేవంత్రెడ్డి వంటి వాళ్లు జీర్ణించుకోలేక ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నా రు. బంగారు తెలంగాణ దిశగా ముందుకు వెళ్తున్న సీఎం సంకల్పాన్ని అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలను సమాజం సహించదన్నారు. కేసీఆర్ పాలనను విమర్శిస్తే ఊరుకోం.. ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఎగిరిపడుతున్న బండి సంజయ్ ‘నీకు దమ్ము ధైర్యం ఉంటే.. నీకు చేతనైతే కృష్ణానదీ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటివాటాపై కేంద్రాన్ని నిలదీయాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2లక్షల 60వేల కోట్లు చెల్లిస్తే, ఇప్పటి వరకు ఇచ్చింది రూ.130 కోట్లు మాత్రమేనని, ఇంకా రావాల్సిన నిధులను సాధించి ప్రజల్లోకి రావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హితవుపలికారు.