నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందాలి
రుణమేళాలో లోటుపాట్లు ఉండొద్దు
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగుటౌన్, అక్టోబర్ 18 : స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసి నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈనెల 21 నిర్వహించనున్న రుణమేళా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీ, బీసీల సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు ఎంత వరకు మంజూరు చేశారో పూర్తి నివేదికలుండాలన్నారు. రుణ మేళా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండొద్దన్నారు. ఆయా బ్యాంకులు క్రమపద్ధతిలో స్టాల్స్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారుడి అర్హత, నిబంధనలకు లోబడి రుణాలు మంజూరు చేయాలన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలో నిరుద్యోగ యువత పాల్గొని శిక్షణ, ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాబిటేషన్ వారీగా యువత వివరాలు అందించాలన్నారు.
తుది దశకు ఈవీఎం గోదాంల నిర్మాణం
కలెక్టరేట్ కార్యాలయంలో చేపట్టిన ఈవీఎం గోదాం నిర్మాణం అన్ని హంగులతో తుది దశకు చేరిందని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. నిర్మాణంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను సోమవారం ఆయన పరిశీలించారు. అన్ని హంగులతో సీసీ కెమెరాల నడుమ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అప్పగించాలని ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మొదటి అస్సెట్గా ఈవీఎం గోదాము మిగిలిపోతుందన్నారు. ములుగు నియోజకవర్గానికి సంబంధించిన వీవీ ప్యాడ్స్ పటిష్టత భద్రత నడుమ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని సమర్థవంతంగా పని చేస్తున్న కలెక్టరేట్ ఏవో శ్యామ్ను అభినందించారు.
ప్రజావాణి వినతులు సత్వరమే పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను కలెక్టర్ స్వీకరించారు. విద్య, ఉపాధి, తాగునీరు, సాగునీరు, భూ సమస్యలపై 60 దరఖాస్తులు వచ్చాయని నిబంధనలకు లోబడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో డీఆర్వో రమాదేవి, డీఆర్డీఏ నాగపద్మజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, బీసీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మణ్, డీవైఎస్వో చారి, ఎలక్షన్ డీటీ రాజు, ఆర్అండ్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.