జనగామ, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ);ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీలో అవకతవకలకు చోటు లేకుండా రాష్ట్ర సర్కారు ‘ఈ-పాస్’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొన్ని స్కూళ్లకు దొడ్డు బియ్యం సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు రావడంతో దీనిని అరికట్టేందుకు పక్కాగా చర్యలు చేపట్టింది. జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 516 సర్కారు స్కూళ్లు ఉండగా, వీటిలో 36,136 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో తెల్లరేషన్ కార్డుదారులకు, పాఠశాలలు, వసతి గృహాలకు ఒకేరకమైన గోనె సంచుల్లో 50 కిలోల చొప్పున బియ్యం సరఫరా అయ్యేవి. వీటిలో దొడ్డు, సన్నరకాల తేడా తెలియక పలుచోట్ల పంపిణీలో తేడా వచ్చింది. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ‘ఈ-పాస్’ను అందుబాటులోకి తెచ్చారు. భోజన నాణ్యతను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవోలతో కమిటీలు వేయనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సన్న బియ్యం పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కారు పకడ్భందీ చర్యలు తీసుకుంది. తాజాగా ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ద్వారా జిల్లాలోని ప్రతి పాఠశాల, హాస్టల్కు చెందిన బియ్యం నిల్వలు, వినియోగం వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే పాఠశాలలు, హాస్టళ్లకు సంబంధించి ప్రత్యేక సంచుల్లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ప్రతి బియ్యపు గింజను లెక్క ప్రకారం చేర్చుతున్నది. మధ్యాహ్న భోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. 2015 జనవరి నుంచి ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి, వసతి గృహాల విద్యార్థులకు సన్న బియ్యం అందజేస్తున్నది. గతంలో ఎంఎల్ఎస్ కేంద్రాల నుంచి స్కూళ్లు, హాస్టళ్లకు అందజేయాల్సిన సన్నబియ్యం సైతం చౌకధరల దుకాణదారులకు పంపించి అక్కడి నుంచి అందరికీ ఒకేరీతిలో బియ్యం సంచులు అందజేసే వారు. కొన్నిచోట్ల పాఠశాలలకు దొడ్డు బియ్యం వస్తున్నాయని ఆరోపణలొచ్చాయి. ఈనేపధ్యంలో సన్నబియ్యం పంపిణీ, వినియోగాన్ని పక్కాగా పర్యవేక్షించాలని నిర్ణయించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవాలను సేకరించింది. గతంలో తెల్లరేషన్ కార్డుదారులకు అందే బియ్యంతో పాటు పాఠశాలలు, వసతి గృహాలకు అందజేసే బియ్యం ఒకేరకమైన 50 కిలోల సంచుల్లో సరఫరా చేసేవారు.
రెండు రకాల బియ్యం ఒకే రకమైన గోనె సంచుల్లో ఉండడంతో అందులో దొడ్డురకం, సన్నరకం బియ్యం తేడా తెలియక పోయేది. సన్నబియ్యంకు బదులు దొడ్డుబియ్యం, దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం సరఫరా అయినట్లు విచారణలో తేలింది. దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు అవకతవలకు పాల్పడడం కొన్నిచోట్ల వెలుగుచూసింది. దీన్ని సీరియస్గా పరిగణించిన ప్రభుత్వం వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే సంచులపై సన్నరకం బియ్యం అని ముద్రించి 50 కిలోల ప్రత్యేక సంచుల్లో సరఫరా చేస్తున్నారు. దీనివల్ల మధ్యాహ్న భోజనం పథకంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన విద్యార్థులకు సన్నబియ్యం అందే వీలుంటుంది. జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 516 ఉన్నాయి. వీటిలో 36,136 మంది విద్యార్థులు చదువుతున్నారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే 341 ప్రాథమిక పాఠశాలల్లో 12,285 మంది, 64 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,867 మంది, 103 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 16,001 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. గత ఏడాది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 34,108 మంది విద్యార్ధులు మాత్రమే ఉండగా కరోనా తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపుతుండడంతో ఈసారి కొత్తగా 2028 మంది విద్యార్ధులు సర్కారు స్కూళ్లకు వస్తున్నారు. సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్ధుల కోసం 90.92 టన్నుల బియ్యం, 91 సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతున్న 15,315 మంది విద్యార్ధులకు ప్రతినెలా 107.40 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.
పారదర్శకంగా మిడ్డేమీల్స్..
పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఓ వైపు సన్న బియ్యం సరఫరాకు తెల్లసంచులను ఉపయోగిస్తుస్తూ విద్యార్థులు, వంట ఎజెన్సీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. మధ్యాహ్న భోజన వివరాలు ఏరోజుకు ఆరోజు విద్యాశాఖకు చేరేలా సెల్ఫోన్లో ఎస్ఎంఎస్ మేసేజ్ అందించే విదానం తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నది. గత విద్యా సంవత్సరం నిర్వహించిన వేసవి బడులు మంచి ఫలితాలను ఇవ్వడంతో ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేయాలంటే మధ్యాహ్న భోజనం మరింత పారదర్శకంగా ఉండాలని భావిస్తున్నది. ఆన్లైన్, బయోమెట్రిక్ విధానంతోపాటు సెల్ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ప్రతిరోజూ విద్యార్థుల సంఖ్య, వినియోగించిన బియ్యం, మిగిలిన వాటి లెక్కలు పక్కాగా ఉండేలా చూడాలని హెడ్మాస్టర్లకు ఉత్తర్వులు అందాయి.
నాణ్యతపై కమిటీల పర్యవేక్షణ..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారం అందజేసేందుకు వీలుగా ఇకపై తప్పనిసరి పర్యవేక్షణ కమిటీలు వేయాల్సి ఉంటుంది. ప్రతివారం భోజనాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా గ్రామస్థాయిలోసర్పంచ్, ఎస్ఎంసీ చైర్మన్, విద్యావేత్తలతో కలిపి కమిటీలు ఏర్పాటు చేయాలి. తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంఈవోతో త్రీమెన్ కమిటీలు మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ పరిశీలించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో ఈ కమిటీలు ఎక్కడా పూర్తిస్థాయిలో పనిచేసినట్లు దాఖలాలు లేవు. వంట ఏజెన్సీల నిర్వహకులు స్థానికులు కావడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకుల అండఉండడంతో ఎస్ఎంసీ చైర్మన్లు అడిగే పరిస్థితి లేదు.
వంట గదుల నిర్మాణం..
కొన్ని పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఏజెన్సీలు ఆరుబయట మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వంట గదులను నిర్మించాలని నిర్ణయించింది. గతంలో మాదిరిగా కాకుండా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గది వైశాల్యం ఉండేలా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు అందాయి. 21 నుంచి 60 మంది విద్యార్థులు ఉండే స్కూల్లో రూ.1.36 లక్షలు, 61 నుంచి 200 మంది ఉన్న పాఠశాలలో రూ.1.86, 201 నుంచి 500 మంది విద్యార్థులు ఉంటే రూ.2.75 లక్షలు, 500కు పైగా ఉంటే రూ.3.35 లక్షలతో వంట గదులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిర్మించనున్నారు.