మహబూబాబాద్, అక్టోబర్ 18 : పోలీస్ అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కే శశాంక, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రీడాపోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తితాలను సైతం పెంపొందిస్తాయని తెలిపారు. జిల్లాలోని 18 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ పంతటి సదయ్య, ఏఆర్ డీఎస్పీ రేలా జనార్దన్రెడ్డి, క్రీడల అధికారి అనిల్, సీఐలు వెంకటరత్నం, సుంకరి రవికుమార్, కరుణాకర్రావు, సాగర్, తిరుపతి, ఎస్సైలు బానోత్ వెంకన్న, రమాదేవి, అరుణ్కుమార్, సంతోష్ పాల్గొన్నారు.
గ్రీవెన్స్ విజ్ఞప్తులను పరిష్కరిస్తాం
ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ఆయన ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్లో వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రమాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలి
కళాశాల వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో 9 గిరిజన, 6బీసీ, 4 ఎస్సీ, 3 మైనార్టీ సహా మొత్తం 21 కళాశాలల హాస్టళ్ల స్థితిగతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యుత్, తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాలు సరిగ్గా ఉండేవిధంగా చూడాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు. డీడీ ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి దిలీప్కుమార్, ఎస్సీ, బీసీ వెల్ఫేర్ అధికారులు బాలరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.