మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 17: పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీపీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించి పక్కా ప్రణాళికతో గ్రామాల రూపురేఖలను మార్చుతున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2021-22 సంవత్సరానికి జిల్లాకు రూ.9.97 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాలోని 16 మండలాల్లో 462 గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేటాయించింది. ఇందులో 50శాతం కేవలం పారిశుధ్యం, తాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్నారు. మిగతా 50శాతం సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ నిధుల రాకతో జిల్లాలోని పల్లెల్లో ‘ప్రగతి’ వెలుగులు నింపుతున్నది.
పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకోసం ప్రత్యేక నిధులు కేటాయించి ‘ప్రగతి’ వెలుగులు నింపుతున్నది. సమైక్య పాలనలో అరకొర నిధులతో తండాల్లో కనీసం తాగునీటి సమస్యలు కూడా తీరేవి కాదు. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి పక్కా ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించి గ్రామాల రూపురేఖలను మార్చుతున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2021-22 సంవత్సరానికి జిల్లాకు రూ. 9.97 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను జిల్లాలోని 16 మండలాల్లో 462 గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదిన కేటాయించింది. ఇవి జీపీల ఖాతాల్లో జమకానున్న నేపథ్యంలో మరింత అభివృద్ధి చెందనున్నాయి.
ప్రధానంగా సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే, గ్రామాల్లో పారిశుధ్యం, హరితహారం, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్, వనాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో వినియోగించి, సకాలంలో పూర్తి చేసి గ్రామ పంచాయతీల్లో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీకేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షపు నీటి నిల్వ, తడి, పొడి చెత్త సేకరణ, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం, కంపోస్ట్ ఎరువుల తయారీ, స్వచ్ఛ భారత్ మిషన్లో చేపట్టే అన్ని అభివృద్ధి పనులకు ఈ నిధులను వినియోగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పారిశుధ్య కార్మికులకు అవసరమైన ఉపకరణాలు, చెత్త బుట్టల పంపిణీ, తాత్కాలిక సిబ్బంది వేతనాల చెల్లింపు, విషజ్వరాలు విజృంభణ ప్రస్తుత తరుణంలో పారిశుధ్యం, అభివృద్ధి పనులకు ఉపయోగించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ ఆర్థికం సంఘం ద్వారా కేటాయించిన మొత్తం నిధుల్లో 50 శాతం టైడ్ నిధులను కేవలం పారిశుధ్యం, తాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తున్నారు. మిగతా 50శాతం అన్టైడ్ నిధులుగా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ నిధుల రాకతో సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు పల్లెలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి.
జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన జీపీలకు నిధులు కేటాయించింది. వాటిని సర్పంచులు, కార్యదర్శుల ద్వారా అభివృద్ధి పనులకు వినియోగించేందుకు ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని అన్ని జీపీలకు నిధులు మంజూరయ్యాయి. వీటితో తాగు నీరు, పారిశుధ్య సమస్యలు తీరాయి. పల్లెప్రగతి ద్వారా పచ్చదనంతో మురుస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.
-రఘువరన్, జిల్లా పంచాయతీ అధికారి