జనగామ మున్సిపల్ పరిధిలో 3,858 మందికి సాయం
కిస్తీలు సక్రమంగా చెల్లిస్తే రెట్టింపు రుణం
పథకం అమలులో రాష్ట్రంలో రెండోస్థానంలో జనగామ
జనగామ చౌరస్తా, అక్టోబర్ 17 : పట్టణాల్లోని వీధి వ్యాపారులకు ఆత్మనిర్భర్ స్వనిధి పథకం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. వారికి ఉపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణసదుపాయం కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ మున్సిపల్ పరిధిలో 4,769 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. ఇందులో 3,858 మందికి మొదటి విడుతలో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.3 కోట్ల 85 లక్షల 80 వేలు రుణాలుగా వివిధ బ్యాంకుల అందించాయి. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వీధి వ్యాపారులకు సరికొత్త పథకం ఊరటనిచ్చింది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.20 వేల చొప్పున మంజూరు చేయనున్నట్లు మెప్మా అధికారులు వెల్లడించారు. మరోవైపు ఎక్కువ మంది వీధి వ్యాపారులను గుర్తించి రుణాలు ఇప్పించిన జనగామ మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది.
కొవిడ్-19 కారణంగా చిరు వ్యాపార రంగం అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజూ కష్టపడితే తప్ప జీవనం సాగించని పరిస్థితిలో ఉన్న వారు లాక్డౌన్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిల్లో చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ స్వనిధి పథకంలో సూక్ష్మ రుణాలు పొందేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు జనగామ మున్సిపల్ పరిధిలో 4,769 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరిలో 3,858 మందికి మొదటి విడుతలో రూ.10 వేల చొప్పున రూ.3 కోట్ల 85 లక్షల 80 వేల రుణాలను వివిధ బ్యాంకుల అందించారు. రుణం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికి రెండో విడుతలో రూ.20 వేల చొప్పున రుణం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలోనే తెలంగాణ నంబర్ వన్
ఆత్మనిర్భర్ స్వనిధి పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్వన్లో ఉండగా, జనగామ మున్సిపాలిటీ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ పథకంలో రుణం పొందిన వారిలో ఎక్కువ మంది పండ్ల వ్యాపారం, రోడ్లపైనే టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు విక్రయించేవారున్నారు. దేశంలో లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో ఆత్మనిర్భర్ స్వనిధి పథకం అమలులో జనగామ రెండో స్థానం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.
సకాలంలో రుణం చెల్లిస్తే రెట్టింపు సాయం
మొదటి విడుతలో రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన లబ్ధిదారులకు మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రుణాలు పొందిన వారి జాబితా బ్యాంకర్ల వద్ద ఉంది. రూ.10 వేల రుణాలు తీసుకున్న వీధి వ్యాపారులు సకాలంలో కిస్తీ మొత్తం చెల్లిస్తే వారికి వెంటనే రూ.20 వేలు రుణం అందించనున్నారు. ఈ మొత్తం రావాలంటే ప్రతి నెలా జాప్యం లేకుండా కిస్తీ చెల్లించిన వారిని బ్యాంకులే గుర్తించి రుణాలిస్తాయి. ఇందుకోసం మున్సిపాలిటీల వారీగా లక్ష్యాన్ని నిర్ణయించారు. త్వరలో రెండో విడుత రుణాలు మంజూరవుతాయని మెప్మా అధికారులు పేర్కొంటున్నారు.
రుణ సాయంతో వీధి వ్యాపారులకు మేలు..
ఆత్మనిర్భర్ స్వనిధి పథకంలో రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. ప్రస్తుతం జనగామలో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అందించిన రుణ సాయంతో నాలాంటి చిరు వ్యాపారులకు మేలు జరిగింది. అప్పుగా తీసుకున్న డబ్బులతో వ్యాపారం చేస్తున్నా. అధికారులు చెప్పినట్లు నెలకు రూ.వెయ్యి చొప్పున కిస్తీ చెల్లిస్తున్నా. త్వరలో ప్రభుత్వం అందించే రెండో విడుత రుణ సాయం కోసం ఎదురుచూస్తున్నా.