కురవి, అక్టోబర్ 17: కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం దసరా పర్వదినం కావడం ఉద్యోగులకు సెలవులు కలిసిరావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
వీరభద్రస్వామిని దర్శించుకున్న ఎన్నికల ప్రధాన అధికారి
వీరభద్రస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి వచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆలయ ఈవో సత్యనారాయణ, పూజారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వయంభు భద్రకాళీ అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. మహామండపంలో వేదపండితులు తీర్థప్రసాదాలు అందచేశారు. ఈవో సత్యనారాయణ ఎన్నికల అధికారికి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. జిల్లా అటవీశాఖ అధికారి రవి కిరణ్, తహసీల్దార్ విజయ్కుమార్ పాల్గొన్నారు.
స్వామివారికి వెండి కిరీటం బహూకరణ
మహిమాన్వితమైన వీరభద్రస్వామికి వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన వీరగంధం శ్రీనివాసరావు, భారతీ కుమారుడు వీరగంధం మహేశ్ రూ. 60వేల విలువైన కిలో మిశ్రమ వెండితో కూడిన కిరీటాన్ని బహూకరించారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మకాంటా అనంతరం ఆలయ అధికారులకు అందచేశారు. భక్తులు మమత, రాజేశ్వరి, కోటేశ్వరరావు, పద్మ, నవ్య, వంకాలపాటి సుధాకర్రావు, సామ్రాజ్యం, వీరభద్రరావు, సరిత, విప్పర్ల శివకుమారి పాల్గొన్నారు.