జలపాతం వద్ద పర్యాటకుల సందడి
సందర్శించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
మౌలిక వసతుల కల్పనపై అధికారులకు సూచనలు
గూడూరు, అక్టోబర్17: మండలంలోని సీతానగరం గ్రామ పరిధి కొమ్ములవంచ గ్రామ శివారులో ఉన్న సహజసిద్ధ భీమునిపాద జలపాతం అందాలకు ప్రజలు ఫిదా అవుతున్నారు. దసరా పర్వదినం, ఉద్యోగులకు సెలవులు కలిసిరావడంతో ఆదివారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్, కలెక్టర్ శశాంక్, ఎఫ్ఆర్వో రవికిరణ్తో కలిసి జలపాతం అందాలను సందర్శించారు. కొండపై నుంచి జాలువారుతున్న జలపాతాన్ని, అటవీ ప్రాంతంలోని అందాలను తిలకించారు. అక్కడ కొద్దిసేపు కలెక్టర్, డీఎఫ్వోలతో భీమునిపాదం చరిత్ర, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎకరం స్థలంలో పర్యాటకులకు తాత్కాలిక హట్స్, కుర్చీలు, పార్కింగ్కోసం స్థలం ఏర్పాటు చేయాలని, పరిసర గుట్టలను పర్యాటకులు ట్రెక్కింగ్ చేసేందుకు వీలుగా చేయాలని అధికారులకు సూచించారు. ఈ పనులు వచ్చే రెండు నెలల్లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చేనెల ఒకటి నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో చనిపోయిన వారు ఉంటే ఓటరు జాబితా నుంచి వారిని తొలగించేలా కుటుంబ సభ్యులు సూచించాలని కోరారు. ఎన్నికల అధికారి వెంట తహసీల్దార్ శైలజ, సీఐ రాజిరెడ్డి, ఎఫ్ఆర్వో రామ్మూర్తి, ఆర్ఐ సాంబయ్య, ఎఫ్ఎస్వో జగ్గయ్య, ఎఫ్బీవో మంగమ్మ, గ్రామస్తులు మన్మోహన్రెడ్డి, వెంకన్న, మంగీలాల్ ఉన్నారు.