నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలి
మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలి
వివిధ శాఖల అధికారులతో సమీక్షలోజిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
జనగామ చౌరస్తా, అక్టోబర్ 17 : కరోనా నియంత్రణలో భాగంగా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో వ్యాక్సినేషన్పై ఆయన సమీక్ష నిర్వహించారు. శివలింగయ్య మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం వ్యాక్సినేషన్కు స్వల్ప విరామం ఇచ్చిందన్నారు. తిరిగి సోమవారం ఉదయం నుంచి యథావిదిగా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కార్యాచరణ చేపట్టాలని కోరారు. బతుకమ్మ, దసరా పండుగల అనంతరం వ్యాక్సినేషన్ పునః ప్రారంభం కానున్న దృష్ట్యా, ఇప్పటికీ టీకా తీసుకోని వారిని గుర్తించి, వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వారీగా ఆశ వర్కర్లు, కమ్యూనిటి హెల్త్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యాక్సిన్తో కలిగే ప్రయోజనాలు తెలిపి, కరోనా కట్టడికి టీకా ఒక్కటే మార్గమని వారికి అవగాహన కల్పించాలి అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం కోసం సంబంధిత శాఖలన్ని సమన్వయంతో పని చేసి, లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ మహేందర్, డీఆర్డీవో రాంరెడ్డి, డీపీవో రంగాచారి, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, మండల ప్రత్యేక అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, మండల వైద్యాధికారులు పాల్గొన్నారు.