ముగిసిన భద్రకాళీదేవీ
శరన్నవరాత్రి ఉత్సవాలు
వరంగల్, అక్టోబర్16 : భద్రకాళీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం కన్నులపండువగా జరిగిన తెప్పోత్సవంతో ముగిశాయి. విజయదశమి పురస్కరించుకుని భద్రకాళీ అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపి చక్రస్నానం చేయించారు. అనంతరం సాయంకాల వేళ భద్రకాళీ తటాకంలో తెప్సోత్సవం నిర్వహించారు. విద్యుత్దీపాలతో అలంకరించిన హంసవాహనంపై అమ్మవారిని భద్రకాళీ చెరువులో ఊరేగించారు. రాత్రి సమయంలో భద్రకాళీ చెరువులో విద్యుత్ వెలుగుల్లో తెప్పపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అబ్బురపరిచింది. పెద్దఎత్తున పాల్గొన్న జనం తెప్పోత్సవ దృశాలను చూసి తరించిపోయారు.
అమ్మవారిని నమ్ముకుంటే విజయం సిద్ధిస్తుంది : మంత్రి ఎర్రబెల్లి
భద్రకాళీ అమ్మవారిని నమ్ముకుంటే విజయం సిద్ధిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. భద్రకాళీ తెప్పోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అమ్మవారిని ఆశీస్సులు ఉండడం వల్లే తాను ఇప్పటి వరకు ఓటమి చెందకుండా విజయం సాధిస్తూ మంత్రిగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ వచ్చాకే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. అర్చకులకు వేతనాలు ఇస్తున్నట్లు చెప్పారు. భద్రకాళీ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అమ్మవారి తెప్పోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ భద్రకాళీ కటాక్షాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమమంలో ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, భక్తులు పాల్గొన్నారు.