కనులపండువలా కొనసాగుతున్న ఉత్సవాలు
ఉగ్రామాతగా దర్శనమిచ్చిన అమ్మవారు
శుక్రవారం ఆలయానికి పోటెత్తిన భక్తులు
మట్టెవాడ, జూలై 16 : వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భద్రకాళి మాతకు నిత్యపూజలు చేశారు. ఉత్సవమూర్తుల్లో కాళీ క్రమాన్ని అనుసరించి ఇచ్ఛాశక్తిని ఉగ్రామాతగా, జ్ఞానశక్తిని శివదూతీమాతగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ దంపతుల సౌజన్యంతో శుక్రవారం ఆలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు.
మాఢ వీధుల నిర్మాణానికి ప్రణాళిక
చారిత్రక నేపథ్యం కలిగిన భద్రకాళి ఆలయంలో మాఢవీధులు, కోనేరు, రాజగోపురం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని సందర్శించారు. మాడవీధులు, కోనేరు, రాజగోపురం నిర్మాణానికి స్థలం, ఇతరత్రా అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంతో ప్రాధాన్యం కలిగిన భద్రకాళి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మాణాలు చేపట్టేందుకు స్థలం పరిశీలించినట్లు తెలిపారు.