సిబ్బంది నుంచి డబ్బులు వసూళ్లు
ఫైల్స్ నిలిపివేయడంతో ఇబ్బందులు
సర్క్యులర్ జారీ చేసినా మారని తీరు
వరంగల్ చౌరస్తా, ఆగస్టు 14 : దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లుగా ఉంది ఎంజీఎంలోని ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించినప్పటికీ అందుకు సంబంధించిన కార్యాలయ ప్రతులను సిద్ధం చేయడానికి కొందరు అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎంజీఎం దవాఖానలోని వివిధ విభాగాల్లో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, విభాగాన్ని బట్టి ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. కరోనా కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించిన వైద్య సిబ్బందిని దేశం మొత్తం గుర్తించి, అభినందిస్తుంటే ఎంజీఎం కార్యాలయ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీని కోసం ఏకంగా పరిపాలనా భవనానికి దూరంగా ఉన్న ఓ విభాగంలో ప్రత్యేకంగా కుర్చీలు, టేబుళ్లు వేసి, కౌంటర్లను ఏర్పాటు చేసి, నగదు వసూలు చేస్తున్నట్లు పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒక్కో విభాగానికి ఒక్కో ఉద్యోగి బాధ్యత వహించి వసూలు చేస్తున్నారు. సంబంధిత ఉద్యోగి అందించిన లిస్ట్ ప్రకారమే కార్యాలయంలో పనులు జరుగుతాయని కొందరు ఉద్యోగులు బాహటంగానే చెబుతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ను వివరణ కోరగా ప్రభుత్వం ఉద్యోగులకు అందించిన పీఆర్సీని పొందడం వారి హక్కు అని, అందుకు ఎవరికీ ఎలాంటి నగదు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ నెల 12న శాఖపరమైన సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచి, సంబంధిత అధికారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.