గొర్రెల యూనిట్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులు
జనగామ రూరల్, జూలై 14 : వృత్తిదారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని ఎంపీపీ మేకల కళింగరాజు అన్నారు. బుధవారం మండలంలోని వడ్లకొండ గ్రామానికి 45 యూనిట్ల గొర్రెల యూనిట్లు రావడంతో వాటిని గొల్ల కురుమలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళింగరాజు మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో వృత్తిదారులను పట్టించుకోలేదని, దీంతో ఉపాధి కరువై వలస వెళ్లారని వివరించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గొల్లకురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నారని కళింగరాజు పేర్కొన్నారు. మరోవైపు ముదిరాజులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో రెండేళ్లుగా మత్స్య సం పద పెరిగిందన్నారు. కుల వృత్తులపై ఆధార పడిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీంతో వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గాయని చెప్పారు.
గొల్లకురుమల అభ్యున్నతికి చర్యలు
గొర్రెల యూనిట్ల పంపిణీతో గొల్లకురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి యార నర్సయ్య తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలకు పెద్ద ఎత్తున జీవాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గొర్రెలను పెంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. సీజన్ వ్యాధులు రాకుండా జీవాలకు మందులు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద, ఏడీ దేవేందర్, మండల పశువైద్యుడు బాల్దె రాజశేఖర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్ రెడ్డి, ఎంపీటీసీ బొల్లం బాల సిద్ధులు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు దండెబోయిన సత్యనారాయణ, గొర్రెలకాపరుల సంఘం నాయకులు పాల్గొన్నారు.