వర్షాలతో చెరువుల్లోకి వరదలు
వ్యవసాయ పనుల్లో అన్నదాతలు
స్టేషన్ ఘన్పూర్, జూలై 14 : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఈసారి మండలంలో పంటల సాగు గణనీయంగా పెరుగనుంది. ఈసారి తొలకరి జల్లులు జూన్ మొదటి వారంలోనే కురిశాయి. రెండోవారంలోనూ మోస్తరు వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని పత్తి, మక్కజొన్న, కంది, పెసర పంటలను సాగు చేశారు. మెట్ట పంటలు ఆశాజనకంగా ఉన్న క్రమంలో మూడు రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరదలొస్తుండడంతో రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. వ్యవసాయ పంపుసెట్ల ఆధారంగా ముందస్తుగా నార్లు పోసిన రైతులు వరినాట్లు వేస్తున్నారు. గత వానకాలం సీజన్లో మండలంలో 14,962 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సారి 15,500 ఎకరాలకు పెరుగుతుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. దేవాదుల రిజర్వాయర్ ఆధారంగా రైతులు వరిసాగు పెంచారని వారు పేర్కొన్నారు. గత వానకాలం సీజన్లో మక్కజొన్న 850 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 500 ఎకరాలకు, పత్తి 6,300 ఎకరాల్లో సాగు చేయగా, ఈ సారి 5010 ఎకరాల్లో సాగు చేస్తున్నారని వారు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులతో గోదావరి జలాలు దేవాదుల రిజర్వాయర్కు చేరుతున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం చెరువులు, కుంటలు నింపుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు పెరుగడంతో వరి సాగు గణనీయంగా పెరుగుతున్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
గోదావరి జలాలతో పెరుగనున్న సాగు విస్తీర్ణం
-నాగరాజు, వ్యవసాయ అధికారి
దేవాదుల ఎత్తిపోతల పథకంతో చెరువులు, కుంటల్లోకి గోదావరి జలాలు వస్తున్నాయి. దీంతో పంటల సాగు పెరుగనుంది. మూడేళ్లుగా స్టేషన్ఘన్పూర్లోని దేవాదుల రిజర్వాయర్ నుంచి చెరువులకు కాల్వల ద్వారా నీరు వస్తున్నది. దీంతో వరిసాగు గణనీయంగా పెరిగింది. వీటితోపాటు పత్తి, మక్కజొన్న, కంది పంటలను సైతం రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.