సమష్టి కృషితో గ్రామాభివృద్ధి
పక్కా ప్రణాళికతో సమస్యలు దూరం
అందుబాటులోకి సకల సదుపాయాలు
ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
భీమదేవరపల్లి, ఏప్రిల్ 14:ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక, సమస్యలున్న చిన్న పల్లె.. ప్రగతి బాటన పయనిస్తోంది. పాలకులు, గ్రామస్తుల సమష్టి కృషితో నేడు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తోంది. ఫలితంగా వీధుల్లో పరిశుభ్ర వాతావరణం, చెత్తాచెదారం లేని రోడ్లు, మెరుగైన సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, అద్దంలా మెరిసే సీసీ రోడ్లతో పాటు ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి వనం, చివరి మజిలీ సాఫీగా సాగేలా వైకుంఠధామం, డంపింగ్యార్డు, కంపోస్ట్షెడ్.. అందుబాటులోకి రావడంతో వందల ఏండ్ల నాటి త్రికూటాలయానికి పూర్వవైభవం వచ్చింది.
పల్లె ప్రగతితో భీమదేవరపల్లి మండలంలోని ముత్తారం గ్రామం కొత్తరూపు సంతరించుకుంది. ఈ గ్రామ జనాభా 1400 కాగా, 326 వరకు కుటుంబాలున్నాయి. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీకి రూ.1.80 లక్షలు మంజూరుచేస్తోంది. వీటితో పారిశుధ్య సిబ్బంది జీతాలు, ఇతరత్రా ఖర్చులు మినహా మిగతా నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. నాడు వీధుల్లో మురుగు నీటి కాల్వలు లేక రోడ్లపైకి దుర్గంధం వెదజల్లేది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు సైడ్ డ్రైనేజీతో పాటు సీసీ రోడ్లు వేయించారు. అలాగే ఇంటింటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకున్నారు. వీధుల్లో సుమారు 125 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 50వేల మొక్కలతో నర్సరీ సిద్ధమైంది. వైకుంఠథామం 90శాతం పూర్తయింది. డంపింగ్యార్డు పూర్తి చేసి తడి, పొడిచెత్తను వేరుగా వేస్తున్నారు. కంపోస్ట్ ఎరువు తయారీ కోసం ఎర్రలను వేశారు.
త్రికూటాలయానికి పూర్వవైభవం
గ్రామంలో ఉన్న 13వ శతాబ్దం నాటి త్రికూటాలయానికి పూర్వవైభవం వచ్చింది. వందల ఏళ్లుగా పూజలకు నోచుకోని ఈ ఆలయంపై పాలకులు, యువకులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద బండరాళ్లను, ముళ్ల కంచెలను తొలగించిన ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కోహెడకు చెందిన శ్రీ రాజయోగి సిద్దేశ్వర మహరాజ్ ఆధ్వర్యంలో మహామృత్యుంజయ హోమం చేయడంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయంలో మళ్లీ నిత్య పూజలు మొదలయ్యాయి.
ప్రకృతి వనానికి కలెక్టర్ ఫిదా
ములుకనూరు నుంచి ముత్తారం వెళ్లే దారిలో రూపుదిద్దుకున్న పల్లె ప్రకృతి వనాన్ని చూసి జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఫిదా అయ్యారు. చుట్టూ గుట్టలు, పంట పొలాలు, రహదారి పక్కన అందంగా పార్కు ఏర్పాటుచేసినందుకు పాలకవర్గాన్ని అభినందించారు. పార్కులో పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు, బెంచీలు కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజల సహకారంతోనే..
ప్రజల పరస్పర సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా గ్రామస్తులతో మాట్లాడి పరిష్కరించుకుంటున్నాం. అన్ని వీధుల్లో సీసీ రోడ్లు, మెయిన్ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నాం. గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికలు వేసుకున్నాం.
ప్రతి ఒక్కరి భాగస్వామ్యం..
గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుతున్నారు. పల్లె ప్రగతి పనులను పక్కా ప్రణాళికతో అమలుచేస్తున్నాం. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు సహా అన్నింటినీ పూర్తిచేశాం. ఉన్నతాధికారుల సూచనలు, పంచాయతీ పాలకవర్గం, ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషిచేస్తున్నా.
ఇవి కూడా చదవండి
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్పై 8 ఏళ్ల నిషేధం
కుంభమేళా ఒక కరోనా ఆటం బాంబు.. రాంగోపాల్ వర్మ సెటైర్లు
కోవిడ్ దెబ్బ.. ఆ నగరాల్లో జననాల కన్నా మృతుల సంఖ్యే ఎక్కువ