ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాలి
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ట్రైసైకిళ్లు, బ్యాటరీ త్రీవీలర్లు, ల్యాప్టాప్ల పంపిణీ
నయీంనగర్, ఏప్రిల్14: ఆసరా పథకంతో దివ్యాంగుల ఆత్మగౌరవం మరింత పెరిగిందని, ఇందుకు నిరంతరం కృషి చేసిన సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పరికరాలు, ఉపకరణాలను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్బన్ జిల్లాలో రూ.1.33కోట్లతో 685మంది దివ్యాంగులకు పరికరాలు, ఉపకరణాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 13వేల మంది లబ్ధిదారులకు ఉపకరణాలు అందుతున్నాయని చెప్పారు.
దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తున్నదని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4లక్షల 92వేల 680మంది దివ్యాంగులకు నెలకు రూ.3,016 చొప్పున ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, స్మార్ట్ఫోన్లు, కృత్రిమ అవయవాలు ఇలా మొత్తం 14రకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఆత్మస్థయిర్యంతో ఉండాలని, లోపం ఉన్నదని బాధపడొద్దని, లోపం ఉన్న వాళ్లకు దేవుడు అంతకు మించిన శక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు. ఎంతో మంది దివ్యాంగులు అద్భుతాలు సృష్టించారని వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఎదుగాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు సాయం చేయనివారే అసలైన వికలాంగులన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దివ్యాంగులకు పరికరాలు, ఉపకరణాలు అందించడం ఆనందంగా ఉందన్నారు.
మనస్సున్న మారాజు కేసీఆర్ : చీఫ్విప్ దాస్యం
అందరి బాధలను అర్థం చేసుకుని పరిష్కరించే మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పేదబడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. గతంలో హాస్టళ్లు ఎలా ఉండేవి? నేడు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఇదే అంబేద్కర్ భవన్లో లైట్లు ఉంటే ఫ్యాన్ ఉండేదికాదని, ఫ్యాన్ ఉంటే లైట్లు ఉండేవి కావని, స్వరాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి, అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, రైతు రుణ విముక్తి సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకన్న, మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరికలు