ఆయన ఆశయాలకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన
మంత్రి సత్యవతి రాథోడ్
అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నాం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
మహబూబాబాద్/హన్మకొండ, ఏప్రిల్ 14 : దేశ ప్రజలందరికీ అంబేద్కర్ ఆదర్శప్రాయుడని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత 130వ జయంతి సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ విద్యావంతుడు కావడం వల్లే రాజ్యాంగ నిర్మాత అయ్యే అవకాశం కలిగిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా గత ప్రభుత్వాలు, నాయకులు దళిత, గిరిజనులకు పెద్దగా చేసిందేమీలేదని, తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే వారి సంక్షేమం కోసం ‘దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్’ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, ఆర్డీవో కొమురయ్య, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రావురి రాజు పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితోనే ముందుకు
డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్లో విగ్రహానికి చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ పుస్తక ప్రతిమను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని.. ఆయన గొప్ప న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి కూడా ఆయనేనని చెప్పారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని మొదట పోరాటం చేసింది కూడా అంబేద్కరేనన్నారు. రాజ్యాంగ పరిషత్లో అనేక మంది సభ్యులున్నా రాజ్యాంగం రాసింది అంబేద్కరేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సైతం అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్ప్లాన్ ఏర్పాటు చేశామని, దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. అంబేద్కర్ విద్యానిధి ద్వారా విదేశాల్లో చదువుకునే వాళ్ల కోసం ఒక్కొక్కరికి రూ.20లక్షల సహాయం చేస్తున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.