ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన పెరిగింది
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వాకింగ్ ట్రాక్కు శంకుస్థాపన
హన్మకొండ, ఏప్రిల్ 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం ఉదయం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్తో కలిసి వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వాకింగ్ చేసే ప్రతి ఒక్కరికీ ఈ ట్రాక్ ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్నెస్పై అవగాహన పెరిగిందని, చాలా మంది ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్ చేస్తున్నారన్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వం కూడా నగరంలో వాకింగ్ ట్రాక్లు, ఇతరత్రా సౌకరాలు కల్పిస్తున్నదన్నారు. ఇటీవల వరంగల్ నగర పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ రూ.2,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ప్రభుత్వం హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా, వరంగల్ను ఫ్యూచర్ సిటీ గా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా నడిపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యం లో దేశంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పమేలా సత్పతి, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.