సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ
అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి
ప్రశాంతంగా బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలి
ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
మహబూబాబాద్, అక్టోబరు 13 : బతుకమ్మ వేడుకలు జరుపుకునే ప్రాంగణాలు నిఘా నీడలో ఉన్నాయని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బతుకమ్మ సంబురాలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయనొక ప్రకటన చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో బతుకమ్మ ప్రాంగణాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. చీమ చిటుక్కుమన్నా పోలీసులకు ఇట్టే తెలిసిపోతుందని గుర్తు చేశారు. ఆడబిడ్డలు ఆటపాటల్లో నిమగ్నమైతే వారు ధరించిన ఆభరణాలు కొల్లగొట్టేందుకు దుండగులు యత్నిస్తుంటారని, వారి ఆట కట్టించేందుకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచామన్నారు. రహదారులపైన పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారన్నారు. అందరూ ప్రశాంత వాతావరణంలో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు పోలీసులకు సహకరించాలన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలందరికీ ఎస్పీ కోటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.