18 అంశాలతో కొత్త ప్రతిపాదిత పనులు
పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు
సమీక్ష సమావేశంలో డీఆర్వో రమాదేవి వెల్లడి
ములుగుటౌన్, అక్టోబర్ 13 : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం జిల్లాకు తలమానికంగా మారిందని ములుగు డీఆర్వో రమాదేవి అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పర్యాటకుల కోసం చేపట్టిన అభివృద్ధి పనులపై పలు శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డీఆర్వో మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు పొంది అంతర్జాతీయ ఖ్యాతిగడించిన రామప్ప శిల్పకళా వైభవం, పరిసర ప్రాంతాల పురోగతి, పర్యాటక అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కోసం సమావేశం ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. జిల్లా, పరిసర గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రణాళిక నిర్వహణ, స్థల సేకరణకు సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్డీవో, ఇన్చార్జి అదనపు కలెక్టర్ కే నాగపద్మజ, జిల్లా టూరిజం అధికారి శివాజీ, ఏకాంబరం, ఎంపీడీవో ఇక్భాల్ హుస్సేన్, ములుగు సీఐ శ్రీధర్, వెంకటాపూర్ ఎస్సై రమేశ్, సర్వేయర్ సుచిత్ర పాల్గొన్నారు.