తెలంగాణ పండుగలకు గౌరవం
ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొదింపజేశారు
అనేక యాగాలు, హోమాలు చేశారు
రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : హిందువులమని చెప్పుకునే వారికి మాటల్లో కాకుండా చేతలతో తన భక్తిని చూపిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణాడ్డి, జ్యోతి దంపతులు నిర్వహిస్తున్న నవాహ్నిక చండీ మహా క్రతువులో బుధవారం మంత్రి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా గొప్ప భక్తుడన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం రాక ముందు, వచ్చిన తరువాత అనేక యాగాలు, హోమాలు చేశారని తెలిపారు. ప్రజల్లో భక్త్తిభావాన్ని పెంపొందించారని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ రెండు పంటలు పండించుకుని ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలని, ప్రజలు, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇలాంటి దైవ కార్యాలు మరిన్ని చేసేలా గండ్ర దంపతులకు శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అనంతరం మంత్రికి అమ్మ వారి శేష వస్ర్తాలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బహూకరించారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అమ్మ వారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, భూపాలపల్లి ఎంపీపీ మందల లావణ్య, డీఎస్పీ సంపత్రావు దంపతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.