స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారం
మండల సభలో ప్రజాప్రతినిధులు
లింగాలఘనపురం, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ అధ్యక్షతన సోమవారం మండల సభ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారుల సహకారంతో మండలంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. గతంలో మూడు పర్యాయాలు జరిగిన పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యలకు నాలుగో విడుత పల్లెప్రగతికి ముందు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. దీంతో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకున్నామని జయశ్రీ వివరించారు. పల్లెప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని అభివృద్ధి పనులపై సమీక్షించి అధికారులకు ఆదేశాలివ్వడంతో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలకు సమాచారాన్ని ఇవ్వడంలేదని, ఇది సరైంది కాదని ఆమె తెలిపారు. ఇప్పటికైనా వారు వైఖరి మార్చుకోవాలని కోరారు.
‘పల్లెప్రగతి’ని కొనసాగించాలి : జడ్పీటీసీ
పల్లెప్రగతితో గ్రామాల్లో పచ్చని వనాలు జీవం పోసుకుని కొత్త కళను సంతరించుకున్నాయని జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి అన్నారు. ఇదే స్పూర్తితో పల్లెప్రగతి కార్యక్రమాన్ని 10 రోజులకే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగించాలన్నారు. మండలంలోని చాలా గ్రామాలకు తన నిధుల నుంచి రూ.60 లక్షలు కేటాయించి సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించామన్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్నిరూట్లలో తారు రోడ్లు వేయించారని వివరించారు. 20 ఎకరాల్లో మోడల్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి రాష్ర్టానికే ఆదర్శంగా మండలాన్ని తీర్చి దిద్దుతామని ఆయన వెల్లడించారు.
23 మందికి రైతుబీమా చెక్కులు అందజేత
వేర్వేరు కారణాలతో మృతి చెందిన 23 మంది రైతులకు రైతుబీమా పథకంలో రూ. కోటి 15 లక్షల చెక్కులు అందించామని వ్యవసాయశాఖ అధికారి జయంత్కుమార్ తెలిపారు. ఈ వానకాలంలో 12,819 మంది రైతులకు రైతుబంధు పథకంలో రూ.17 కోట్ల 87 లక్షల 86 వేల 972 వారి ఖాతాల్లో జమచేశామన్నారు. మండలంలో 100 విద్యుత్ స్తంభాలు అవసరమని గుర్తించామని విద్యుత్ ఏఈ మధు తెలుపగా, జడ్పీటీసీ వంశీధర్రెడ్డి జోక్యం చేసుకుంటూ 200 స్తంభాలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎంపీపీ జయశ్రీ మాట్లాడుతూ పల్లెప్రగతిలో విద్యుత్ అధికారుల పనితీరుపై ఆరోపణలు వస్తున్నాయని, దీనిని గుర్తించి పద్ధతి మార్చుకోవాలని కోరారు. రైతువేదిక భవనాల బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేసిన ఏఈని పల్లెప్రగతిలో మంత్రి దయాకర్రావు సస్పెండ్ చేశారని తెలిపారు. ప్రస్తుత ఏఈ నరేశ్తో బిల్లులు మంజూరు చేయించుకోవాలన్నారు. మండల సభలో వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్కుమార్, స్పెషలాఫీసర్ లత, ఇన్చార్జి తహసీల్దార్, డీటీ ధీరజ్కుమార్, ఎంపీడీవో సురేందర్ నాయక్, ఎంపీవో మల్లికార్జున్, మండల వైద్యాధికారి కరుణాకర్రాజు, మండల పశు వైద్యురాలు అనిత, ఐసీడీఎస్ ఏసీడీపీవో విక్టోరియా, సూపర్వైజర్ రమాదేవి, ఏఈ లు మధు, నరేశ్, రోషిణి, ఎంపీటీసీలు సోమలక్ష్మి, తీగల సిద్దూగౌడ్, గోలి రాజు, కృష్ణవేణి, గండి మల్లమ్మ, సర్పంచ్లు కాటం విజయ, కత్తుల శ్రీపాల్రెడ్డి, బూడిద జయరాజేశ్వర్గౌడ్, కడారి కృష్ణ, బోళ్ల సత్యనారాయణ, మార్కెట్ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు పాల్గొన్నారు.