అర్హతలున్న యువతకు అవకాశం
జిల్లాలో ఇప్పటికే 22 మందికి ఉపాధి
మరో 50 మందిని గుర్తించిన డీఆర్డీవో
ఈనెల 16 నుంచి హైదరాబాద్లో వివిధ రంగాల్లో శిక్షణ
దేవరుప్పుల, డిసెంబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకంతో భరోసా ఇస్తున్నది. ఉపాధిహామీ పథకంలో 100 రోజులు పనిచేసిన పేద కుటుంబాలకు ఈ అవకాశం కల్పిస్తున్నది. 2018 సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. టెన్త్తోపాటు ఆపై విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపున్న యువతీయువకులను ఎంపిక చేస్తున్నారు. వీరికి దేశంలో పేరున్న వివిధ సంస్థల్లో స్వయం ఉపాధిపై శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. జిల్లాలో మొదటి విడుతలో 22 మందికి శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీల్లో చేర్పించారు. రెండోవిడుతలో 50 మందిని గుర్తించారు. వీరికి ఈ నెల 16 నుంచి హైదరాబాద్లో శిక్షణ ఇప్పించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారి ఆసక్తికనుగుణంగా పలు కంపెనీల్లో అవకాశం కల్పించనున్నారు.
రెక్కాడితేగాని డొక్కాడని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అందిస్తున్నది. ఉపాధిహామీ పథకంపై ఆధారపడిన వారి కుటుంబాల్లోని యువతీయువకులకు ‘ఉన్నతి’ పథకం ద్వారా భరోసా కల్పిస్తున్నది. ఏడాదిలో 100 రోజులు పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాల్లోని వారిని పూర్తి స్ధాయిలో స్ధిరపడేలా ప్రోత్సహిస్తున్నది. తద్వారా వారు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 12 మండలాల్లలో టెన్త్, ఆపై తరగతులు చదివిన యువజనులకు ఆసక్తిగల వృత్తిలో నైపుణ్యం సాధించేలా శిక్షణ అందించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పూర్తయిన 22 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. రెండో బ్యాచ్లో 50 మందిని గుర్తించగా వారికి ఈ నెల 16 నుంచి హైదరాబాద్లో శిక్షణా తరగతులు జరుగనున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం 2018-19 సంవత్సరంలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు 6004 ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చదుకుని ఉపాధిలేక కూలి పనులకు వెళ్తున్న 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులు. నిబంధనల ప్రకారం ఉపాధిహామీ పనుల్లో వీరి కుటుంబాలు వంద రోజులు పనిచేసి ఉండాలి. ఇందులో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలనే ఆలోచన ఉన్న వారికి శిక్షణనిచ్చి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఆసక్తిగల వారు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించాలి.
నిరుద్యోగులకు ఉపాధిలో శిక్షణ
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. వీటిలో దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్ (కృషి విజ్ఞాన కేంద్రం), ఆర్ఎస్ఈటీ 9 రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్(నాక్), ఎంప్లామెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఉన్నాయి. శిక్షణలో నైపుణ్యం సాధించేవారికి ప్రభుత్వం నేరుగా పలు సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.ఆయా వృత్తి శిక్షణను బట్టి శిక్షణా సమయంలో వసతి, భోజనం కల్పించి స్టయిఫండ్ ఇస్తారు
పలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు
ప్రైవేట్రంగంలో పేరున్న వాల్మార్ట్, డీమార్ట్, జుడియో, రత్నదీప్, వెస్ట్సైడ్, ప్యాంటలూన్ వంటి పేరుమోసిన వ్యాపార కంపెనీల్లో సేల్స్మెన్, కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్, సూపర్వైజర్ పోస్టుల్లో స్ధిరపడవచ్చు. స్వయం ఉపాధిగా కుట్టు శిక్షణ, సెల్ఫోన్ రిపేరు, ఎంబ్రాయిడరీ, పట్టు పరిశ్రమ స్ధాపన, తేనె తయారీ పరిశ్రమ, ప్లంబింగ్, సెంట్రింగ్, స్టోర్ సూపర్వైజర్, కీపర్, సర్వేయర్ వంటి ఉద్యోగాలు, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్లో శిక్షణనిచ్చి స్ధిరపడేలా చేస్తారు. శిక్షణ పూర్తయి స్వయం ఉపాధి పొందే వారికి సబ్సిడీతో కూడిన బ్యాంక్ రుణం ఇప్పించి ఆయా రంగాల్లో ఉపాధి పొందేలా డీఆర్డీఏ చూస్తుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రారంభ వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తారు. పనితీరును బట్టి ప్రమోషన్లు వస్తాయి.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ
తెలంగాణలో తొలిసారి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో వంద రోజులు పనిదినాలు పూర్తి చేసిన పిల్లలకు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి అశోక్ లేలాండ్, టాటా, మహేంద్ర వంటి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు ఉంది. శిక్షణపూర్తయి, లైసెన్స్ సంపాదిస్తే అనేక ప్రైవేటు రంగ సంస్ధలు డ్రైవింగ్ చేయడానికి ఆహ్వానిస్తాయి.
వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నా..
మా కుటుంబం పేదరికంతో గ్రామంలో ఉపాధిహా మీ పనులపై ఆధారపడేది. నేను డీఆర్డీఏ అందించిన ఉన్నతి పధకంలో 90 రోజ లు శిక్షణ పొందాను. వెంటనే హైదరాబాద్లోని పేరుమోసిన ఇంటర్నేషనల్ వస్త్ర పరిశ్రమ జుడియో కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం అందులో సీఎస్ఏ( కస్టమర్ సర్వీస్ అసోషియేట్)గా పనిచేస్తున్నా. వృత్తిలో సంతృప్తిగా ఉంది. నా కుటుంబం ఆర్ధికంగా కోలుకోవడానికి ఈ ఉద్యోగం తోడ్పడింది.