జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం
పత్తి, కంది, మొక్కజొన్న, పెసరకు మేలు
వరిసాగుకు సిద్ధమవుతున్న రైతులు
జనగామ, జూలై 11 (నమస్తే తెలంగాణ) : వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన ముసురు ఊరటనిచ్చింది. జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో పత్తి, మక్కజొన్న, కంది, పెసర పంటలకు జీవం లభించింది. జిల్లా కేంద్రంలో కురిసిన వర్షంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలయమయ్యాయి. కొద్దిరోజులుగా ముఖం చాటేసిన వానలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రుతుపవనాలు చురు గ్గా కదులుతున్నాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు రైతుల్లో వానకాలం పంటలపై ఆశలు చిగురింప చేశాయి. కురుస్తున్న వానలు ఇప్పటికే మొలకెత్తిన పత్తి మొక్కలకు ఊపిరిపోయడంతో అన్నదాత ఉత్సాహంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు వేసవిని తలపించగా వాయివ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఒక్కసారిగా వాతావారణం చల్లబడింది. అదనులో అడపాదడపా వర్షాలు కురిసినా వరి పంటకు ఊపిరి పోయడంతోపాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలు ఈసారి గట్టెక్కుతాయని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో జూన్ మొదటి వారం నుంచే అడపాదడపా మోస్త్తరు నుంచి భారీ వర్షాలు కురియడంతో అప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోగా, జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాలు రైతులు, కూలీలతో కళకళలాడుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల కొనుగోళ్లతో ఆదివారం సైతం ఫర్టిలైజర్ షాపుల్లో రైతుల సందడి నెలకొంది. మరోవైపు జనగామ, దేవరుప్పుల, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, లింగాలఘనపురం, జఫర్గఢ్, బచ్చన్నపేట, రఘునాథపల్లి, చిల్పూరు మండలాల్లో అత్యధికంగా, మిగిలిన ప్రాంతాల్లో మోస్త్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దేవరుప్పులలో 104.3 మి.మీ, వావిలాలలో 100.8 మి.మీ, కోలుకొండలో 91.0 మి.మీ, స్టే.ఘన్పూర్లో 88.5 మి.మీ, పాలకుర్తిలో 87.8 మి.మీ, లింగాలఘనపురంలో 80.8 మి.మీ, జఫర్గఢ్లో 77.5 మి.మీ, బచ్చన్నపేటలో 76.0 మి.మీ, రఘునాథపల్లిలో 74.3 మి.మీ, తాటికొండలో 72.5 మి.మీ, జనగామలో 68.8 మి.మీ, కూనూరులో 66.5 మి.మీ, మల్కాపూర్లో 64.5 మి.మీ, కొడకండ్లలో 56.5 మి.మీ, తరిగొప్పులలో 56.0 మి.మీ, బచ్చన్నపేటలో 55.8 మి.మీ, నర్మెటలో 45.3 మి.మీ, జనగామ రూరల్లో 45.3 మి.మీ, పాలకుర్తిలో 39.3 మి.మీ వర్షం కురిసింది.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : మండలంలో ఆదివారం ఉదయం నుం చి మూడు గంటల పాటు చిరుజల్లులు కురిశాయి. ఎడతెరిపిలేని ముసురు పత్తి చేన్లకు మేలు చేస్తుందని, వరి సాగుకు దుక్కులు దున్నేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు తెలిపారు. కోలుకొండకు పైభాగంలో కురిసిన వర్షాలతో వస్తున్న వరదలకు వాగు జలకళ సంతరించుకుంది. దీంతో మండలంలో వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కొడకండ్లలో..
కొడకండ్ల : మండల వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది, ఉదయం కొంత వి రామం ఇచ్చిన వాన మధ్యాహ్నం నుంచి భారీగా పడింది. కుండపోత వర్షంతో మం డల వ్యాప్తంగా వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముసురుతో కూడిన వర్షం కురిసింది. ఆరు తడి పంటలు సాగు చేసిన రైతన్నలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ అధికారులు చెప్పారు. మరోవైపు పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పది రోజులు మండలంలోని అన్ని గ్రామాల్లో నాటిన మొక్కలకు వర్షం ఊపిరిపోసినట్లయింది. భారీ వర్షం కురిసి చెరువుల్లోకి నీరు చేరితే నార్లు పోస్తామని రైతులు చెబుతున్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గూడూ రు గ్రామంలోని 9వ వార్డులో డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎడతెరిపిలేని ముసురుతో మెట్ట పంటలకు ఊపిరి లభించిందని రైతులు తెలిపారు.