సీహెచ్సీలో పెరుగుతున్న వైద్య సేవలు
కొత్తగా ఏడుగురు వైద్యుల నియామకం
ఇప్పటికే విధుల్లో 12 మంది
ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి
త్వరలో అందుబాటులోకి మాతాశిశు సంరక్షణ కేంద్రం
ఏటూరునాగారం, డిసెంబర్ 7 : మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాల ద్వారా ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే సామాజిక వైద్యశాలలో 12 మంది వైద్యులు ఉండగా మరో ఏడుగురిని నియమించింది. వీరిలో ప్రత్యేక వైద్య నిపుణులు ఉండడం గమనార్హం. ప్రధానంగా మహిళలకు వైద్యసేవలు అందించడంపై శ్రద్ధ చూపనున్నారు. గత ప్రభుత్వాల కంటే ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు ప్రభు త్వం వైద్యశాలలపై నమ్మకం పెరిగేలా చేసింది. ఈ నేపథ్యంలో రోజురోజుకూ దవాఖానలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల సంఖ్య ఉండాలని నిర్ణయించిన ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యులను నియమించాలని సూచించడంతో కలెక్టర్, డీసీహెచ్ఎస్ చొరవతో కొత్తగా ఏడుగురు వైద్యులను నియమించారు. ఈ మేరకు స్థానిక సీహెచ్సీలో ఉన్న సిబ్బంది వివరాలను దవాఖాన సూపరింటెండెంట్ మారోజు సురేశ్కుమార్ బుధవారం వెల్లడించారు. ఇద్దరు గైనకాలజిస్టులు (హారిక, లీనా), ఇద్దరు అనస్తీషియన్లు (రామానుజం, గోపీనా థ్), జనరల్ సర్జన్ (హైమావతి), ఈఎన్టీ (వాసవీ), ఎంబీబీఎస్ ఉషారాణిని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే వైద్యశాలలో చాతివైద్య నిపుణులు, గైనకాలజిస్టులు, అనస్తీషియా, పిల్లల వైద్య నిపుణులు, ఎంబీబీఎస్లు సుమారు 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ములుగు ఏరియా దవాఖానకు డిప్యుటేషన్పై వెళ్లారు.
ప్రసవాల సంఖ్య పెంచడమే లక్ష్యం
సీహెచ్సీకి ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రతి రోజు 150 ఓపీ ఉంటుంది. మంగళ, గురు, శనివారాల్లో గర్భిణు లు వస్తుండగా నెలకు 80 ప్రసవాలు చేస్తున్నాం. ఈ సంఖ్యను120కి పెంచేలా కృషి చేస్తున్నట్లు సురేశ్కు మార్ తెలిపారు. రెండు, మూడు నెలల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రం వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాలుగు నెలల్లో డయాగ్నస్టిక్ సెంటర్ భవనం పూర్తవుతుందని, బ్లడ్ బ్యాంకుతో ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్నట్లు వెల్లడించారు.