ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలి
ఈజీఎస్ పనులను పారదర్శకంగా నిర్వహించాలి
అడిషనల్ డీఆర్డీవో వసుమతి
దుగ్గొండి, డిసెంబర్ 8: బృహత్ పల్లెప్రకృతి వనాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీవో వసుమతి అన్నారు. దుగ్గొండి మండలంలోని కేశవాపురంలో మెగాపార్కు పనులను బుధవారం ఆమె ఎంపీడీవో కృష్ణప్రసాద్, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లెప్రకృతి వనాలను నిర్మిస్తున్నదని వసుమతి అన్నారు. పార్కు నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం దుగ్గొండిలోని ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్లు, ఉపాధిహామీ పనుల నిర్వహణపై సిబ్బంది, అధికారులతో అడిషనల్ డీఆర్డీవో సమీక్షించారు. గ్రామాల్లో ఈజీఎస్ పనులను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అక్రమాలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఏపీడీ పరమాత్మ, ఏపీవో రామకృష్ణ, ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచ్ రేవూరి నారాయణరెడ్డి, కార్యదర్శి పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’తో గ్రామాల సుందరీకరణ
నల్లబెల్లి: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయని ఎంపీడీవో విజయ్కుమార్ అన్నారు. నాగరాజుపల్లెలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో పరిశీలించారు. అనంతరం జీపీ కార్యాలయంలో సర్పంచ్ గోనె శ్రీదేవితో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించారు. పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పనులు చేపట్టారని, నాటిన ప్రతి మొక్కనూ రక్షించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే, ఎంపీడీవో ముచ్చింపులతండాలోని ఊరచెరువులో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలు పనులను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. ఎంపీడీవో వెంట సర్పంచ్ రవళితారాము, కార్యదర్శి అనిల్కుమార్ ఉన్నారు.
మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి
నర్సంపేట రూరల్: నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వరరావు అన్నారు. ఏనుగల్తండా, ఇప్పల్తండా, ఇటుకాలపల్లిలో నర్సరీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్పంచ్లు బానోత్ స్వాతి, బీ సుజాత, ఎం రవీందర్, కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.
ఉపాధి కూలీల హాజరు శాతం పెంచాలి
చెన్నారావుపేట: ఉపాధిహామీ కూలీల హాజరు శాతం పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీడీ సాయిచరణ్ సూచినంచారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, తడి, పొడి చెత్త నిర్వహణ పనులను పక్కాగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో గడ్డల దయాకర్, ఎంపీవో గౌడ సురేశ్, ఏపీవో అరుణ, కార్యదర్శులు పాల్గొన్నారు.