తాడ్వాయి, డిసెంబర్ 8 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి బస్సుల్లో వచ్చే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం విజయ్భాస్కర్ అన్నారు. వరంగల్-2 డిపో మేనేజర్ మహేశ్కుమార్, సిబ్బందితో కలిసి మేడారంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాట్ల పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల కోసం 3,845 సర్వీసులను, 51 పాయింట్ల ద్వారా నడుపుతున్నట్లు తెలిపారు. గత జాతరలో జరిగిన లోటుపాట్లను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సిబ్బందికి ఇబ్బంది కలగకుండా రెస్ట్ రూమ్లతో పాటు బస్టాండ్ ఏరియాను సర్వేలెన్స్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. క్యూ రెయిలింగ్స్, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నుంచి బస్ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు ఆయన వివరించారు. ఆయన వెంట సిబ్బంది శ్రీదేవి, శ్రీనివాస్, బుచ్చయ్య ఉన్నారు.
మేడారంలో భక్తుల సందడి
ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సారలమ్మ దేవత గద్దెపై కొలువుదీరే రోజు కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, కొంగళమడుగు, జంపన్నవాగు ప్రాంతాల్లో వంటలు చేసుకుని విందు భోజనాలు చేశారు.