రూ.6లక్షల విలువైన 9 బైకులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
హన్మకొండ సిటీ, ఆగ స్టు 5 : ద్విచక్రవాహనాల దొంగను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.6లక్షల విలువైన 9 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం, పెగడపల్లి గ్రామానికి చెందిన దామెర రాజ్కోటి పెయింటర్గా రోజువారీ కూలి పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసై డబ్బులు సరిపోక బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం రద్దీగా ఉండే హాస్పిటల్స్ను ఎంచుకున్నాడు. బైక్లపై దవాఖానకు వచ్చే వారిని గుర్తించి, అవకాశం చూసుకుని బైక్లను చోరీ చేసేవాడు. ఇలా రాజ్కోటి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 బైక్లను అపహరించాడు. కాగా, నగరంలో హాస్పిటల్స్ పరిసరాల్లో బైక్లు చోరీ అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు సెంట్రల్జోన్ డీసీపీ పుష్ప ఆదేశాల మేరకు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేశ్ దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఎంజీఎం జంక్షన్లో తనిఖీలు చేస్తుండగా బైక్పై వస్తున్న రాజ్కోటిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన దొంగతనాలు ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన సెంట్రల్జోన్ డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, మట్టెవాడ, కేయూసీ ఇన్స్పెక్టర్లు గణేశ్, జనార్దన్రెడ్డి, కానిస్టేబుళ్లు తిరుపతి, అశోక్ను సీపీ అభినందించారు.