త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్
వయో పరిమితిని తగ్గిస్తూ ఇటీవల కేబినెట్లో నిర్ణయం
ఉమ్మడి జిల్లాలో 90,356మందికి ప్రయోజనం
ఓటరు జాబితా ఆధారంగా అర్హుల గుర్తింపు
ఇప్పటికే 4.44 లక్షల లబ్ధిదారులు
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయంసామాజిక భద్రతతో పాటు పేద వృద్ధులకు భరోసా ఇచ్చే ‘ఆసరా’ వచ్చేస్తోంది. ఇప్పటివరకు 65 ఏండ్లున్న వారికి వృద్ధాప్య పింఛన్ ఇస్తున్న కేసీఆర్ సర్కారు.. ఇటీవల ఆ వయో పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం 57 ఏండ్లు నిండిన అర్హులందరికీ రూ.2016 చొప్పున పింఛన్ త్వరలో అందించనున్నది. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 90,356 మందికి లబ్ధి చేకూరనుండగా, ఇప్పటికే 4.44 లక్షల మందికి పింఛన్ అందుతున్నది. ఈమేరకు జిల్లాలవారీగా ఓటరు కార్డు ఆధారంగా అర్హుల జాబితా సిద్ధమవుతోంది.
వరంగల్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలనే నినాదంతో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని మరిం త విస్తృతం చేస్తోంది. పేదల అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు వివిధ పథకాలతో వారికి భరోసా ఇస్తోంది. ఇందులో భాగంగా సామాజిక భద్రత కల్పించే ‘ఆసరా’ పథకంతో మరింత మందికి లబ్ధిచేకూర్చాలని భావించి, వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అన్ని జిల్లాల్లో అర్హుల జాబితా సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుతం 4.44లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వయో పరిమితి సడలించడంతో కొత్తగా 90,356 మందికి పింఛన్ అందనుంది.
పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే అర్హులను గుర్తించి ఓటరు కార్డులోని వయస్సు ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు ఎకరాలలోపు తరి, ఏడున్నర ఎకరాలలోపు మెట్ట భూములు ఉన్న వారికే ‘ఆసరా’కు అర్హత ఉంటుంది. ఈమేరకు అధికార యంత్రాంగం అర్హులకు పింఛన్ అందించే ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాలవారీగా కొత్తగా అర్హత పొందే వారి వివరాలను గతంలోనే సేకరించిన అధికారులు మరోసారి వీటిని సరి చూసుకుంటున్నారు. గ్రామాలవారీ వివరాలతో మండల జాబితా రూపొందిస్తున్నారు. ఇలా జిల్లాస్థాయిలో అర్హుల సంఖ్య ఖరారు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ఉన్న జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరును జాబితాలో చేర్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అందరికీ ఆసరా..
అవసరమైన అన్ని వర్గాల పేదలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాల, హెచ్ఐవీ బాధితులకు ప్రతి నెలా పింఛను ఇస్తున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచారు. వికలాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.500 నుంచి రూ.1500లకు పెరిగింది. మిగిలిన పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచారు. దేశంలో ఎకడా లేని విధంగా బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పింఛన్లు ఇవ్వడం ప్రారంభించారు. పెరిగిన సామాజిక పరిస్థితులు, ఖర్చుల మేరకు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని సీఎం కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మరోసారి పింఛన్ల మొత్తాన్ని పెంచారు. దివ్యాంగుల పింఛన్ను రూ.1500 నుంచి రూ.3016 కు, మిగిలిన పింఛన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.2016కు పెంచారు. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి పెరిగిన మేరకు పేదలకు సర్కారు ప్రతి నెలా సాయం చేస్తోంది. తాజాగా వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో రాష్ట్రం మొత్తంలో కొత్తగా 7.26 లక్షల మంది అర్హులుగా ఉన్నారని అధికారుల అంచనా వేశారు. ఇందులో వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే 90వేల మంది ఉన్నారు. 2018 నవంబర్ 19న విడుదల చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా కొత్త అర్హుల జాబితా రూపొందించారు. 2019 జూన్ వరకు పెన్షన్ల చెల్లింపుల కోసం ప్రతి నెల రూ.414.36 కోట్లు ప్రభుత్వం ఇచ్చేది. పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడంతో 2019 జూలై నుంచి ప్రతి నెల రూ.834.97 కోట్లు ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోంది. పోస్టల్ శాఖ బయోమెట్రిక్, బ్యాంకుల ద్వారా పంపిణీ జరుగుతోంది.