సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
మొక్కలు నాటిన నుంచి కాతకు వచ్చేదాకా ఏడాదికి రూ.36వేల సబ్సిడీ
తొర్రూరులో ఫ్యాక్టరీ కోసం వంద ఎకరాల భూమి కేటాయింపు
రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అర్బన్, రూరల్ జిల్లాలకు చెందిన 150మంది రైతులతో
కలిసి ఖమ్మం జిల్లాలో క్షేత్ర సందర్శన
తొర్రూరు/వర్ధన్నపేట, ఆగస్టు 5 : మన దేశం ప్రస్తు తం రూ.80 వేల కోట్ల విలువైన పామాయిల్ను ఏటా దిగుమతి చేసుకుంటున్నదని, రాబోయే 30 ఏళ్ల వరకు పామాయిల్ పండ్ల గెలల ధరకు భరోసా ఉంటుందని, సాగుపై రైతులకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం అందిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల నుంచి సుమారు 150మంది రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతుబంధు సమితి కన్వీనర్లతో కలిసి గురువారం ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి మండలాల్లో క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లారు. వాహనాలను వర్ధన్నపేటలో ప్రారంభించారు. తొర్రూరులోని ఎల్వైఆర్ గార్డెన్లో అల్పాహారం చేసి బయలుదేరారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ పామాయిల్ పంట కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరాకు రూ.36వేల సబ్సిడీని ప్రకటించారని చెప్పారు.
నేరుగా పామాయిల్ తోటలను పరిశీలించి అవగాహన పెంచుకునేందుకు, అక్కడి రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందకు వెళ్తున్నట్లు చెప్పారు. పామాయిల్ మొక్కలు పెట్టిన తర్వాత 3 లేదా 4 ఏళ్ల నుంచి ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. పంట సాగుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో నేలలు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రతి జిల్లాలో పామాయిల్ సాగు ప్రోత్సాహానికి పరిశ్రమలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
మూడు మండలాల్లో క్షేత్ర సందర్శన
ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల్లో వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య క్షేత్ర సందర్శన చేశారు. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో పామాయిల్ నర్సరీని పరిశీలించారు. దమ్మపేట మండలం అప్పారావుపేటలో పామాయిల్ కర్మాగారానికి వెళ్లారు. గెలల అన్ లోడింగ్, క్రషింగ్, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తదితర ప్రక్రియల గురించి ఫ్యాక్టరీ మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు. ఇదే మండలంలోని అల్లిపల్లి, మందలపల్లిలో పామాయిల్ తోటలను పరిశీలించారు. మందలపల్లిలో పామాయిల్కు అంతర పంటగా వేసిన అరటి సాగు విధానంపై తెలుసుకున్నారు. అల్లిపల్లిలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దేశం ప్రస్తుతం రూ.80 వేల కోట్ల విలువైన పామాయిల్ను ఏటా దిగుమతి చేసుకుంటున్నదని, రాబోయే 30 ఏళ్ల వరకు పామాయిల్ పండ్ల గెలల ధరకు భరోసా ఉంటుందని వరంగల్ అర్బన్ జిల్లా రైతు యాదగిరి అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. పామాయిల్ మొక్కలు నాటిన నుంచి కాతకు వచ్చే వరకు ఎకరాకు రూ.36 వేలు ఖర్చవుతుండగా ఆ మొతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. తొర్రూరులో పామాయిల్ కర్మాగారం కోసం వంద ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. అలానే సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో రైతులు కరివేద (వెదజల్లే) పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంటను కూడా రైతులతో కలిసి పరిశీలించారు. మంత్రితో వర్ధన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మోహన్రావు తదితరులున్నారు.