30ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే కల్పతరువు
ఎకరాకు రూ.2లక్షలు వచ్చే అవకాశం
‘ఆయిల్ఫెడ్’ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం
తొర్రూరులో ఫ్యాక్టరీ, నర్సరీ
నేడు 400 మంది రైతులకు అవగాహన సదస్సు
హాజరుకానున్న మంత్రి దయాకర్రావు, ఆయిల్ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి
ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకుంటుంది.. చీడపీడలకు ఎదురొడ్డి నిలబడుతుంది.. కోతులు, అడవి పందులు, దొంగలకు అవకాశం ఇవ్వనిది.. ఏటా రూ.2లక్షల చొప్పున 30ఏళ్ల పాటు ఆదాయాన్నిచ్చే కల్పతరువది.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ‘ఆయిల్పామ్’ సాగువైపు ప్రోత్సహిస్తున్నది. పండిన పంటకు ప్రత్యేక ఫార్మర్కోడ్, దిగుబడులకు పక్కా మార్కెటింగ్, వారానికి రెండు సార్లు నేరుగా రైతు ఖాతాల్లోకే డబ్బు జమ చేసే సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇప్పటికే అనేక జిల్లాల్లో పామాయిల్ సాగుకు అంకురార్పణ జరగ్గా, ఉమ్మడి జిల్లాలోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సాగుపై అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల నుంచి 150మంది రైతులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఖమ్మం జిల్లాలో క్షేత్ర సందర్శనకు తీసుకెళ్లడం, నేడు 500 మందితో తొర్రూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడంతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కేందుకు శుభపరిణామంగా తోస్తున్నది.