పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రచారం
గ్రామాల్లో ఉత్సాహంగా పల్లెప్రగతి
జనగామలో కొనసాగుతున్న పట్టణప్రగతి
జనగామ, జూలై 4 (నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి పనులు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆదివారం జనగామ పట్టణంలోని పలు వారుల్లో ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, చిల్పూరు మండలంలో జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు పల్లె ప్రగతి ప్రణాళికలపై గ్రామసభలను నిర్వహించారు. రహదారులు, డ్రైనేజీలు శుభ్రం చేయించారు. గ్రామాల్లో మురికి తుమ్మ చెట్లు, శిథిలమైన ఇండ్లను యంత్రాలతో తొలగించారు. ఏ గ్రామం లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, వీధిలైట్లు వెలుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నా యో వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీధిలైట్ల కోసం ప్రత్యేకంగా మూడోలైన్ను ఏర్పాటు చేయడం అవసరమా అనే అంశాలను వార్డుల్లో పర్యటిస్తున్న బృందాలు పరిశీలించి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులతో ప్రతిపాదనలకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా జనగామలోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, కమిషనర్ నర్సింహ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆకుపచ్చ తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం
నర్మెట : ఊరూరా మొక్కలు నాటి రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీని ఆయన చేపట్టారు. ఆదివారం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు పూలతో ముస్తాబు చేసి, డప్పు చప్పుళ్లతో మహిళలు, అధికారులు ఇంటింటికీ వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. హన్మంతాపూర్లో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్తో పాటు ఆయా గ్రామాల్లో సర్పంచ్లు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఆమెడపు కమలాకర్రెడ్డి, రామిని శివరాజ్, నర్ర వెంకటరమణారెడ్డి, పగడాల విజయ నర్సయ్య, జాల శ్వేత, కంతి హేమలత, నీరేటి రాణి, ఎంపీటీసీలు, ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్, ఎంపీవో గఫూర్, ఏపీవో రమాదేవి పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ఉత్సాహంగా హరితహారం
దేవరుప్పుల : పల్లెప్రగతిలో భాగంగా మండలంలో హరితహారం ఉత్సాహంగా కొనసాగుతున్నది. 32 జీపీల నర్సరీల నుంచి మొక్కల పంపిణీ చేపట్టారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రహదారులకు ఇరువైపులా 60 వేల మొక్కలు నాటినట్లు ఎంపీడీవో ఉమామహేశ్వర్ తెలిపారు. కడవెండి- దేవరుప్పుల రహదారిపై రెండు కిలోమీటర్ల వరకు మొక్కలు నాటారు. డబుల్బెడ్ రూం ఇళ్ల ప్రాంగణంలో ఇంటింటికీ మొక్కలు పంచారు. మంత్రి ఎర్రబెల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని నీర్మాలలో టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు, ఈ కార్యక్రమంలో ఎంపీవో కవికుమార్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పండుగలా మొక్కల పంపిణీ..
బచ్చన్నపేట : మొక్కల పంపిణీ కార్యక్రమం మండలంలో పండుగలా కొనసాగుతున్నది. ట్రాక్టర్కు బ్యానర్, పచ్చటి తోరణాలు కట్టి డప్పు చప్పుళ్లతో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి మొక్కలు పంపిణీ చేస్తున్నారు. ఆదివారం చిన్నరామన్చర్లలో సర్పంచ్ ఎండీ. కలీల్బేగం, పంచాయతీ కార్యదర్శి రొండ్ల శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు పాదయాత్రగా ఇంటింటికీ వెళ్లి ఆరు మొక్కలు అందించారు. వీఎస్ఆర్.నగర్లో సర్పంచ్ కోనేటి స్వామి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి వీదుల్లో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కేశిరెడ్డిపల్లిలో సర్పంచ్ మల్లవరం దివ్యాఅరవింద్రెడ్డి ఇంటింటికీ వెళ్లి మొక్కలు అందించి నాటాలని కోరారు.
గ్రామాల్లో మొక్కల పంపిణీ
తరిగొప్పుల : నాలుగో విడుత పల్లెప్రగతిలో భాగంగా ఆదివారం మండల వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేకాధికారి శ్రీపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ రెడి ్డ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంవల్ల వ్యాధులు దరిచేరవన్నారు. హరితహారంలో భాగంగా ఇంటింటా ఆరు మొక్కలు నాటి ప్రజలను భాగస్వాము లను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి, సర్పంచ్ దామెర ప్రభుదాస్, ఎంపీటీసీ అర్జుల మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు జొన్నగోని సుదర్శన్ గౌడ్, ముద్దసాని వెంకట్రెడ్డి, అర్జుల సంపత్ రెడ్డి, అమిరిశెట్టి విరేందర్, ముక్కెర బుచ్చిరాజు యాదవ్, చిలివేరు లింగం పాల్గొన్నారు.