30శాతం పెరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు
జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
గత జూన్ నుంచి పెరిగిన వేతనాలు వర్తింపు
జిల్లాలో 670 మంది ప్రజా ప్రతినిధులకు లబ్ధి
సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల హర్షం
బయ్యారం, అక్టోబర్ 2 : నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 30శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో జిల్లాలో 670 మంది ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరనుంది. సర్పంచ్లు, ఎంపీటీసీలకు రూ.5వేల నుంచి 6,500, ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.పదివేల నుంచి రూ.13వేలకు వేతనాలు పెరుగునుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను గుర్తించి అండగా నిలిచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తున్నది. వారి గౌరవ వేతనాలను 30శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన గౌరవ వేతనాలు గత జూన్ నెల నుంచి వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నది. దీంతో జిల్లాలోని 16 మంది జడ్పీటీసీలు, 196 మంది ఎంపీటీసీలు, 458 మంది సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్కారుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇంతకు ముందు సర్పంచ్లు, ఎంపీటీసీలు రూ.5వేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు రూ.పదివేల గౌరవ వేతనం అందిస్తున్నది. 30శాతం వేతనాల పెంపుతో సర్పంచ్లు, ఎంపీటీసీలకు రూ.6500, ఎంపీపీలు, జడ్పీటీసీలకు రూ.13 వేల గౌరవ వేతనాలు అందనున్నాయి.
రెండోసారి పెంపు..
ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు స్వరాష్ట్రంలో సముచిత గౌరవం దక్కుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో మేజర్ పంచాయతీల సర్పంచ్లకు రూ.వెయ్యి, మైనర్ పంచాయతీ సర్పంచ్లకు రూ.600, ఎంపీటీసీలకు రూ.2500, ఎంపీపీ, జడ్పీటీసీలకు రూ.5వేలు మాత్రమే గౌరవ వేతనం అందేది. అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. కానీ, స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి గౌరవాన్ని పెంచారు. సర్పంచ్లు, ఎంపీటీసీలకు రూ.5వేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు రూ.10వేలకు వేతనాలు పెంచి సకాలంలో అందజేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరో 30 శాతం వేతనాలు పెరుగడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో గ్రామాల అభివృద్ధికి మరింత ఉత్సాహంగా పనిచేస్తామంటున్నారు.
వేతనం పెంపు హర్షణీయం..
నిత్యం ప్రజల మధ్య ఉం టూ ప్రజాసేవ చేస్తున్న మాకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో ప్రజా ప్రతినిధులకు గౌరవం మరింత పెరిగింది.