నమస్తే నెట్వర్క్:పంట పెట్టుబడికి పైసలిచ్చి.. రంది తీర్చిన సీఎం కేసీఆర్కు రైతాంగం జేజేలు పలుకుతున్నది. ‘రైతు బంధు’ వచ్చినంక అప్పుల జోలికి పోతలేమని స్పష్టం చేస్తున్నది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు ఈ డబ్బులే అక్కరకొస్తున్నాయని చెబుతున్నది. ఒక వేళ కాలం కలిసి రాక పంట చేతికి రాకున్నా అప్పులోళ్ల బాధ లేదని గుండెలపై చెయ్యేసుకొని ధీమా వ్యక్తం చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే ఎవుసాన్ని పండుగ చేశాడని, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే సాగులో ముందుకెళ్తున్నామని స్పష్టం చేస్తున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు మిన్నంటుతున్నాయి.
సాగుకు భరోసావొచ్చింది..
జఫర్గఢ్, డిసెంబర్ 30 : రైతులు గతంల వ్యవసాయం చేయాలంటే భయపడి పట్నాలకు పోయి బతుకులు ఎల్లదీసుకునేటోల్లు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సారు సీఎం అయినంక పట్నాలకు పోయినోళ్లు ఊళ్లళ్లకు వచ్చి మళ్ల ఎవుసం చేసుకుంటున్నరు. కరంటు ఉచితంగా ఇచ్చి, పంటల పెట్టుబడికి డబ్బులిచ్చి రైతులందరికి బంధువైండు. మా ఊళ్లో ఎవుసం చేసేందుకు రైతులు సావుకారి దగ్గర, అడ్తి దుకాణాల్లో రూ.3 చొప్పున వడ్డీకి అప్పులు తెచ్చుకుని పంటలు పండించేటోళ్లం. వచ్చిన డబ్బు అప్పుకే సరిపోయేవి కావు. నాకు ఊళ్ల మూడెకరాల భూమి ఉంది. రైతుబంధు పైసలు ఏడాదికి రూ.30 వేలు వస్తున్నయి. ఇప్పుడు అప్పుకు ఎక్కడికి పోవడం లేదు. ఉన్న మూడెకరాలు ఎవుసం చేసుకుని సంతోషంగ ఉంటున్న.
మేం .. బాయి తొవ్విచ్చుకున్నం
నాకు నాలుగెకరాల పొలం ఉంది. నా భర్త పేరు ఉప్పలయ్య. ఆయన ఇప్పుడు లేడు. నేను నా కొడుకు పొలం చేసుకుంటూ బతుకుతానం. మూడేళ్ల కిందట నీటికి గోస బాగుండె. ఎవుసంకు నీరు సరిపోయేది కాకుండె. రూ. 70 వేలు పెట్టి బాయిని 3 కోలల లోతు తవ్విచ్చిన. అప్పటి నుండి నీటి గోస తప్పింది. పంటకు సరిపడ నీళ్లు ఎల్లుతున్నయ్. ఇప్పుడిప్పుడే మా జీవితాలు మారుతున్నయ్. కేసీఆర్ సారు పుణ్యమా అని సంవత్సరానికి 40 వేలు పెట్టుబడికి ఇస్తాండు. గా పైసలతోనే బాయి తొవ్విచ్చుకున్నం. గీ కేసీఆర్ సారు మా గు రించి ఆలోచించి అన్ని తీర్ల సాయపడుతుండు. ఆయన ఎప్పుడూ సల్లగ ఉండాలె.
ఈ పైసలు కూలీలకు పనిజేత్తయి
స్టేషన్ఘన్పూర్, డిసెంబర్ 30: ఎవుసం చేసినంక పైసలొత్తయ్యని సంబురపడుతం. కానీ పంట ఏసేట ప్పుడు చేతిల చిల్లిగవ్వుండదు. బాకీల కోసం ఆడఈడ తెలిసినోళ్లు, సావుకార్ల దగ్గర మిత్తికి పట్టుకొత్తం. అప్పుడు డబ్బుల్లేకపోతె టైముకు పంట ఏయలేం. లేటుగేత్తె సక్కగ దిగుబడి రాదు. గివన్ని తెలిసే సీఎం కేసీఆర్ సారు పెట్టుబడికి రైతుబంధు పైసలిస్తాండు. గీ డబ్బులతో నాకు కూలీల బాధ తప్పినట్లయ్యింది. పనులు చేసినందుకు వారికి ఈ పైసలిస్త. రైతులను అన్ని తీర్ల ఆదుకుంటున్న సీఎంకు అండగా ఉంటాం.