ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకే నూతన రేషన్కార్డులు
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
ములుగులో రేషన్ కార్డుల పంపిణీ
ములుగు రూరల్, జూలై 26 : రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నూతన రేషన్ కార్డులు జారీ చేసి పేదల పెన్నిధిలా నిలుస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన రేషన్కార్డుల పంపిణీకి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేదలకు రెండు కిలోల బియ్యం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకే కాకుండా వలస కార్మికుల కు సైతం రూ.500 ఇస్తూ బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ములుగు జిల్లాలో 2831 మందిని గుర్తించి వారికి నూతన రేషన్కార్డులు ఇచ్చినట్లు చెప్పారు. ఇంకా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారిని గుర్తించి కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలో నూతన రేషన్షాపుల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలను అందించాలని, లేకపోతే కొత్త గ్రామ పంచాయతీల్లో సైతం మూడు రోజుల పాటు డీలర్లు లబ్ధిదారులకు రేషన్ అందించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉపయోగంలో లేని రేషన్ కార్డులను గుర్తించి సరెండర్ చేయాలన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా లో పేదలు ఎక్కువగా ఉన్నారని, వారికి దరఖాస్తు చేసుకునే విధానం తెలియదని, అలాంటి వారిని అధికారులు గుర్తిం చి కార్డులు అందించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్నారు. దీంతో పాటు పింఛన్ సైతం అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం కేసీఆర్ పేదల కోసం నూతన రేషన్కార్డులు అందించడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో హన్మంత్ కే జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి, డీఆర్వో రమాదేవి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గట్టమ్మ వద్ద మొక్క నాటిన మంత్రి
ములుగు మండలంలోని గట్టమ్మ దేవాలయం వద్ద సో మవారం మంత్రి సత్యవతిరాథోడ్ హరితహారంలో భాగం గా ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్తో కలిసి మొక్క నాటారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న మంత్రి ముందుగా గట్టమ్మకు మొక్కులు చెల్లించారు. అనంతరం పూజారుల సంఘం ఆధ్వర్యంలో గట్టమ్మ వనం ఏర్పాటు చేయడంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరైన మంత్రి పూజారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, సభ్యులు సదయ్య, పుల్లయ్య, సాంబయ్య, రాజ్కుమార్, సంజీవ పాల్గొన్నారు.