భూపాలపల్లి టౌన్, ఆగష్టు 4:పంట చేలల్లోకి డ్రోన్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అనేక రంగాల్లో వీటిని విరివిగా వాడుతుండగా, ప్రస్తుతం వ్యవసాయ పనులకూ ఉపయోగపడనున్నాయి. చీడపీడల నివారణ కోసం పురుగుమందు పిచికారీ చేసేందుకు అందుబాటులోకి వచ్చాయి. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఒక ప్రైవేట్ కంపెనీ రెండు డ్రోన్లతో డెమో ఇవ్వనుండగా రైతుల్లో ఆసక్తి, ఉత్సాహం నెలకొంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంట చేలలో డ్రోన్లు ఎగురనున్నాయి. డ్రోన్ల సేవలు అన్ని రంగాల్లో ఉపయోగపడుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడా వ్యవసాయరంగంలోనూ ఉపయోగపడుతున్నాయి. ఈ తరుణంలో జిల్లాలోనూ వీటిని ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. తద్వారా రైతుల వ్యయప్రయాసలు తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కాటారం మండలంలో ప్రయోగాత్మకంగా డ్రోన్లతో పురుగు మందులను పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే రెండు డ్రోన్లను సిద్ధంగా ఉంచారు. గురువారం ప్రతినిధులు డెమో చేసి చూపించనున్నారు. ఈ పిచికారీ విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్తో పాటు రై తులు హాజరుకానున్నారు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఏవో అన్నారు. ఈ డ్రోన్లు 200 నుంచి 600 లీటర్ల సామర్థ్యంతో మందును పిచికారీ చేస్తాయని చెప్పారు. అయితే రూ.6 లక్షలు వెచ్చించి రైతులు డ్రోన్ను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు కనుక అద్దెకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎకరానికి రూ.450 చార్జీ ఉండగా నేడు డెమో తర్వాత కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి తగ్గించాలని కోరనున్నట్లు డీఏవో చెప్పారు. అద్దె తక్కువ ఉంటే డ్రోన్ సేవల్ని వినియోగించుకునేందుకు చాలామంది రైతులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.