కరోనా ఉధృతి నేపథ్యంలో పలు జీపీల్లో శానిటైజేషన్
దుకాణ సముదాయాల పనివేళల్లో మార్పులు
స్వచ్ఛందంగా తీర్మానాలు
కొడకండ్ల, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలో శుక్రవారం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో మండల కేంద్రంలో సర్పంచ్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు. గ్రామంలో కొనసాగుతున్న లాక్డౌన్కు అందరూ సహకరించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కుందూరు అమరేందర్రెడ్డి, ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యుడు శ్రావణ్ పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేసుకున్న రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్..
మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ దీకొండ వెంకటేశ్వర్ రావు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
స్టేషన్ ఘన్పూర్లో..
స్టేషన్ ఘన్పూర్ : మండలంలోని శివునిపల్లి గ్రామంలో దుకాణాలు, హోటళ్లు, జన సమూహ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈవో వెంకటకిశోర్ హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఈవో వెంకట కిశోర్ మాట్లాడు తూ.. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఐసొలేషన్లో ఉండాలని, లక్షణాలు ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
నిబంధనలు పాటించాలి..
జనగామ రూరల్ : రోజురోజుకూ కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పెంబర్తి సర్పంచ్ అంబాల అంజనేయులు హెచ్చరించారు. జీపీ కార్యాలయంలో పాలకవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి గ్రామంలో 12 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. హోటళ్లు, కిరాణాషాపులు, చికెన్ సెంటర్లు, వైన్స్ తదితర దుకాణాలు తీర్మానం చేసిన ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంబాల రవి, ఉపసర్పంచ్ రేఖ, పంచాయతీ కార్యదర్శి ప్రపుల్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఐసొలేషన్ సెంటర్లో శానిటైజేషన్..
దేవరుప్పుల : దేవరుప్పుల ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం ఐసొలేషన్ సెంటర్ చేస్తుండగా శుక్రవారం తరగతి గదులను గ్రామపంచాయతీ సిబ్బంది శానిటైజ్ చేశారు. ఎంపీడీవో ఉమామహేశ్వర్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునస్వామి పారిశుధ్య కార్మికులతో శానిటైజ్ చేయించారు.