వర్ధన్నపేట, ఆగస్టు 4: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని డీటీవో భవాని సూచించారు. ఇల్లంద పరిధిలోని భారత్గ్యాస్ కార్యాలయ ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు బాధ్యతగా మొక్కలను నాటి వృక్షాలుగా ఎదిగేలా చూడాలన్నారు. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో భారత్గ్యాస్ మేనేజర్ తుమ్మల శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.
డంపింగ్ యార్డుల్లోనే చెత్త వేయాలి
గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుల్లోనే చెత్తను వేయాలని డీపీవో ప్రభాకర్ సూచించారు. మండలంలోని ల్యాబర్తి, ఇల్లందలో ఆయన డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనాలను డీఎల్పీవో ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేస్తూ డంపింగ్ యార్డుల్లో వేయాలన్నారు. పల్లెప్రకృతి వనాలను ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు నిత్యం సందర్శిస్తూ మొక్కలు చనిపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్మాణ పనుల్లో అలసత్వం వీడాలి
గీసుగొండ: వైకుంఠధామాల నిర్మాణ పనుల్లో అలసత్వం వీడాలని ఎంపీవో ప్రవీణ్కుమార్ సూచించారు. నందనాయక్తండాలో ఆయన వైకుంఠధామాన్ని పరిశీలించారు. పనులు చేయని వారిపై జిల్లా అధికారులకు నివేదికలు అందిస్తామన్నారు. డంపింగ్ యార్డులో చెత్తను రీసైక్లింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బదావత్ అమ్మి, కార్యదర్శి బీ రాజు పాల్గొన్నారు.
అర్హులందరికీ జాబ్కార్డులు అందించాలి
ఖానాపురం: మండలంలో గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ జాబ్కార్డులు అందజేయాలని ఎంపీడీవో సుమనావాణి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆమె కార్యదర్శులతో సమీక్షించారు. హరితహారంలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో పర్వీన్ కైసర్, కార్యదర్శులు పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయకపోతే వేటు..
శాయంపేట: మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెలాఖరులోగా వైకుంఠధామాలను పూర్తి చేయకపోతే సస్పెన్షన్ తప్పదని ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి అధికారులను హెచ్చరించారు. గట్లకానిపర్తి, నర్సింహులపల్లిలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఆయన తనిఖీ చేశారు. వసంతాపూర్, గంగిరేణిగూడెం, నర్సింహులపల్లిలో పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు. సూర్యనాయక్తండాలో అటవీ శాఖ భూమి వల్ల ఆలస్యమైందన్నారు. ఆయన వెంట ఎంపీవో రంజిత్కుమార్, ఈజీఎస్ ఏపీవో అనిత ఉన్నారు.
మెగా పార్కు పనుల పరిశీలిన
పర్వతగిరి: కొంకపాక శివారులో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మెగాపార్కు పనులను ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సుమారు 20 వేల మొక్కలు నాటేలా పార్కును సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ సత్యనారాయణ, సర్పంచ్ వర్కాల రమేశ్, కార్యదర్శి హుస్సేన్, సుమన్, వీఆర్వో బాలకొమురెళ్లి పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో తన కార్యాలయంలో కార్యదర్శులు, ఫీల్డ్ ఆఫీసర్లతో ఉపాధిహామీ పనులు, హరితహరంపై సమీక్షించారు. పల్లెప్రగతి పనులు నిరంతరం కొనసాగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఏపీవో సుశీల్కుమార్, ఎంపీవో మధుసూదన్, కార్యదర్శులు పాల్గొన్నారు.